ఏపీ అసెంబ్లీ ఎన్నికలకూ, తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి అయ్యింది. గురువారంతో నామినేషన్ల దాఖలు అంకం ముగిసింది. శుక్రవారం రోజున నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 29 తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నికల ప్రక్రియలో ఒక కీలకమైన ఘట్టం ముగిసింది.
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు దాదాపు మూడు వేల మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. 25 లోక్ సభ స్థానాలకు దాదాపు 555 మంది నామినేషన్లను దాఖలు చేశారు. వీరిలో ప్రధాన పార్టీల తరఫున రెండో నామినేషన్ గా దాఖలు చేసిన వారు ఉన్నారు. భర్తతో పాటు భార్య నామినేషన్లు వేసిన చోట్లున్నాయి. అలాగే పలు చోట్ల రెబల్ క్యాండిడేట్లు కూడా బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్లు, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు సరేసరి.
రెబల్స్ పోటు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకే ఉంది. అనేక నియోజకవర్గాల్లో చోటామోటా నేతలు రెబల్స్ గా బరిలోకి దిగి నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ తరఫున కష్టపడ్డ తమకు అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెబల్స్ గా బరిలోకి దిగిన వారిలో మాజీ ఎమ్మెల్యేల కన్నా.. కొత్త వారే ఉండటం గమనార్హం. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనల పోటీకి అవకాశం ఇవ్వడంతో అలిగిన వారు, మరి కొన్ని చోట్ల తెలుగుదేశం అభ్యర్థులే బరిలో ఉన్నా కొందరు తిరుగుబాటు దార్లు పోటీకి నామినేషన్లను దాఖలు చేశారు.
మరి నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 29 వ తేదీ వరకూ అవకాశం ఉంది. మరి ఆలోపున వీరిని బుజ్జగించి విరమింపజేస్తారేమో చూడాల్సి ఉంది. ఎన్నికల ఖర్చులు భారీ స్థాయిలో పెరిగిపోవడంతో కూడా రెబల్స్ నామినేషన్లకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. నామమాత్రంగా పోటీలో దిగేసే రోజులు కావివి, బరిలో ఉన్నారంటే కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఇలాంటి నేపథ్యంలో టికెట్ల విషయంలో నిరాశవహులు ఎంతమంది ఉన్నా, వారు పోటీకి దిగడానికి మాత్రం వెనుకాడే పరిస్థితి ఏర్పడింది.