జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇవాళ నామినేషన్ వేయడానికి అట్టహాసంగా బయల్దేరారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలులో తీసుకున్న అద్దె భవనంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన చేరారు. ఆ ఇంటి నుంచే నామినేషన్కు భారీ జనసందోహం మధ్య ఆయన కదిలారు.
వేలాదిగా జనసేన కార్యకర్తలు తరలిరాగా, ఆయన ముందుకు కదిలారు. మొదట కొంత దూరం పవన్ ఒక్కడే ర్యాలీలో కనిపించారు. కొంత ఆలస్యంగా పవన్తో టీడీపీ ఇన్చార్జ్ వర్మ కలిశారు. అలాగే ర్యాలీలో జనసేన జెండాలే ఎక్కువగా కనిపించాయి. అక్కడక్కడ మాత్రమే పసుపు, కాషాయ జెండాలు కనిపించడం గమనార్హం.
తమ అభిమాన నాయకుడి నామినేషన్ కార్యక్రమానికి జనసేన కేడర్ ఉత్సాహంగా హాజరైంది. టీడీపీ, బీజేపీ శ్రేణులు మొక్కుబడిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు చర్చ జరుగుతోంది. పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య అనుమానాల మధ్య రాజకీయం నడుస్తోంది. తన సీటును లాక్కున్న పవన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్మ సహకరించరనే చర్చ నడుస్తోంది.
అయితే పైకి మాత్రం పవన్కు వర్మ సహకరిస్తున్నట్టే కనిపిస్తున్నా, అసలు రాజకీయం ఎన్నికల నాటికి చూడొచ్చని అంటున్నారు. అసలే వర్మ అంతగా విశ్వసించదగ్గ నాయకుడు కాదని జనసేన నాయకులు అంటున్నారు. ఎన్నికల రోజు వరకూ వర్మ ఎలా వ్యవహరిస్తారో అనే టెన్షన్ జనసేనకు తప్పేలా లేదు.