టీడీపీ, ఎల్లో మీడియా పాలిట వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి సింహ స్వప్నం అయ్యారు. ఆయన దెబ్బకు ఎల్లో బ్యాచ్ హడలిపోతోంది. అవ్వాతాతలకు ఇళ్ల వద్దకే వచ్చే పింఛన్ను అడ్డుకున్న ఎల్లో బ్యాచ్ నియంతృత్వ చర్యలను రాచమల్లు బజారుకీడ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక పింఛన్లను వలంటీర్ల ద్వారా 66 లక్షల మంది లబ్ధిదారులకు అందించకూడదని నిమ్మగడ్డ రమేశ్కుమార్ ద్వారా చంద్రబాబు, పవన్కల్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి అడ్డుకున్న సంగతి తెలిసిందే.
దీంతో రెండో నెలలో కూడా పింఛన్దారులకు కష్టాలు తప్పడం లేదు. కొందరు వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. ఈ నెలలో పింఛన్లను బ్యాంక్ ఖాతాలకు వేయాలని నిమ్మగడ్డ ద్వారా కూటమి నేతలు ఎన్నికల సంఘానికి దిశానిర్దేశం చేశారు. ఈ విషయాన్ని నిమ్మగడ్డ మీడియాకు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. విమర్శలకు తావు ఉండకూడదనే ఉద్దేశంతో బ్యాంక్ ఖాతాలున్న లబ్ధిదారులకు జమ చేయాలని ఎన్నికల సంఘం ఏపీ సర్కార్ను ఆదేశించింది. అలాగే బ్యాంక్ ఖాతాలు లేని వారికి సచివాలయాల వద్ద పంపిణీ చేయాలని ఆదేశించింది.
దీంతో ఎన్నికల సంఘం ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. పింఛన్ సొమ్ము తెచ్చుకోడానికి రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, ఇతరత్రా లబ్ధిదారులు బ్యాంక్లకు క్యూ కట్టారు. గంటల తరబడి వేచి చూడాల్సిన దయనీయ స్థితి. కూటమి వల్ల అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారులు బ్యాంక్ల వద్ద పడుతున్న కష్టాలను సమాజం దృష్టికి తెచ్చేందుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నేరుగా ఆయనే బ్యాంక్ల వద్దకు వెళ్లారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న అవ్వాతాతలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ కష్టనష్టాలకు కారణం ఎవరని ఆయన వారిని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు, పవన్, పురందేశ్వరి అని బాధిత లబ్ధిదారులు చెప్పారు. ఈ కష్టాలన్నీ పోవాలంటే వైసీపీని ఆదరించాలని ఆయన కోరారు. ఒకే ఒక్క నెల ఓపిక వహిస్తే, మళ్లీ వలంటీర్ల ద్వారా పింఛన్లను ఇళ్ల వద్దే అందిస్తామని ఆయన అవ్వాతాతలకు భరోసా ఇచ్చారు. అలాగే అవ్వాతాతలకు ఆయన చల్లని పానీయాలు తెప్పించి, వారితో పాటు ఆయన తాగి ఓదార్చి, భవిష్యత్పై భరోసా ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఎల్లో మీడియా, మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు టీడీపీకి అసలు నచ్చడం లేదు.
ఎందుకంటే ప్రొద్దుటూరులో టీడీపీ బరిలో వుంది. రాజకీయంగా నష్టం వస్తుందని టీడీపీ నేతలు భయపడుతున్నారు. అలాగే తాము ఆరాధించే టీడీపీ కొంపను రాచమల్లు కూల్చేస్తున్నాడని ఎల్లో మీడియా శివాలెత్తిపోయి వక్రభాష్యాలు చెబుతోంది. మొత్తానికి ఎల్లో బ్యాచ్ పాలిట రాచమల్లు శివప్రసాద్రెడ్డి సింహస్వప్నమయ్యాడనే చర్చకు తెరలేచింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అభ్యర్థులంతా ఇదే రీతిలో చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.