ఎన్నికల సమయంలో వలంటీర్లు అత్యంత చర్చనీయాంశమయ్యారు. వలంటీర్లతో తమకు రాజకీయంగా భారీ దెబ్బ తగులుతుందని ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. దీంతో ఎలాగైనా వలంటీర్లను ఎన్నికల తెరపై లేకుండా చేయాలని ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా పావులు కదిపాయి. ఈ క్రమంలో తమ మద్దతుదారుడైన ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్కుమార్ వలంటీర్లపై చేసిన ఫిర్యాదుతో పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకోగలిగారు.
ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. మండుటెండలో సచివాలయాల వద్దకు వెళ్లిన పండుటాకులు సొమ్మసిల్లి 33 మంది మృత్యువాత పడ్డారు. ఈ నెగెటివిటీ అంతా కూటమికి రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించింది. దీంతో వలంటీర్ల విషయంలో నష్ట నివారణకు చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వలంటీర్లకు ఇప్పటి వరకు ఇస్తున్న నెలకు రూ.5 వేల గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానని చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వలంటీర్లంతా కూటమి వైపు వుంటారని చంద్రబాబు, ఇతర ప్రతిపక్ష నేతలు ఆశించారు. ఈ నేపథ్యంలో వలంటీర్ల రాజీనామాలు చూస్తే , వారంతా ఎటు వైపు ఉన్నారో అర్థమవుతుంది. ఇప్పటి వరకు 44,163 మంది వలంటీర్లు రాజీనామా చేసినట్టు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా తెలిపారు. అలాగే 1017 మందిని తాము తప్పించినట్టు ఎంకే మీనా వెల్లడించారు. అలాగే 86 మంది వలంటీర్లపై కేసు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు.
వలంటీర్లపై ఈ లెక్కలు చాలు ...వారంతా ఎటు వైపు ఉన్నారో అర్థం చేసుకోడానికి. జగన ప్రభుత్వం 2 లక్షలకు పైగా వలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే. వారిలో 25 శాతం మంది ఏకంగా జగన్ కోసం రాజీనామా చేయడం గమనార్హం. మిగిలిన వాళ్లంతా ఎటూ తాము చేయగలిగిందేమీ లేదనే ఉద్దేశంతో వలంటీర్లు రాజీనామా చేయలేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు. చంద్రబాబు ఎర వేసినా వలంటీర్లు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు