ఆ రెండూ తప్ప అన్నీ మాట్లాడిన బాబు!

విశాఖ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు కీలక విషయాల మీద మాట్లాడకుండా మిగిలినదంతా మాట్లాడారని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. గాజువాకలో సభ పెట్టిన బాబు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద టీడీపీ స్టాండ్ ఏమిటో చెప్పకుండా పారిపోయారని మంత్రి గుడివాడ అమర్నాధ్ సెటైర్లు వేశారు.

స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని బీజేపీ చెబుతోందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పలేదని మంత్రి అన్నారు. బీజేపీ ద్వారా ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్ ని కొనసాగిస్తామని కూడా హామీ ఇవ్వలేదని అంటున్నారు.

వైసీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకమని మంత్రి అంటున్నారు. తాము చెప్పినంత క్లారిటీగా చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. విశాఖను వైసీపీ రాజధానిగా ప్రకటించిందని చంద్రబాబు విశాఖ రాజధాని మీద ఏమీ మాట్లాడలేదని వైసీపీ నేతలు ఎత్తి చూపుతున్నారు.

వైసీపీ మీద భూ కబ్జాలు అంటూ విమర్శలు చేయడం తప్ప విశాఖను తాము రాజధానిగా చేస్తామని బాబు ఎందుకు చెప్పడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఓట్లకు సీట్లకు విశాఖ కావాలని కానీ అభివృద్ధి చేయడానికి అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరాంధ్రా వెనుకబాటు తనానికి టీడీపీ పాలానతో పాటు చంద్రబాబు కారణం అని వైసీపీ మంత్రులు అంటున్నారు. బాబు ఉత్తరాంధ్ర కు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా అని నిలదీస్తున్నారు. కీలక అంశాలను పక్కన పెట్టి వైసీపీని తిట్టి చంద్రబాబు జనాల మెప్పు ఎలా పొందుతారు అని వారు ప్రశ్నిస్తున్నారు. బాబు విశాఖ రాజధాని మీద అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఇప్పటికైనా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.

Show comments