బండారుకు దక్కని హామీ... గాజు గ్లాస్ సంగతేంటి?

టీడీపీలో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి. పార్టీ పుట్టినప్పటి నుంచి అందులో ఉన్న నేత. ఎనభైల్లో విశాఖ జిల్లాలో చురుకైన యువనేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తొలుత మండలాధ్యక్షుడిగా పనిచేసి 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1998 నాటికి మంత్రి కూడా అయ్యారు. ఆయన పరవాడలో ఎన్నో సార్లు గెలిచారు.

ఆ తరువాత పెందుర్తిగా మారిన తరువాత 2014లో గెలిచారు. బలమైన నేత సొంత సామాజిక వర్గంలో పట్టున్న నేత అయిన బండారుని కాదని జనసేనకు ఈ టికెట్ కేటాయించారు. అది కూడా వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన నేతకు ఇచ్చారని పెందుర్తికి చెందిన పక్కా లోకల్ కి టికెట్ నిరాకరించడం ఏమి న్యాయమని తమ్ముళ్ళు అంటున్నారు.

తనకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ అధినాయకత్వం అన్యాయం చేసిందని బండారు మండిపోయారు. పార్టీకి ఒక దండం పెట్టేసారు. ఎందరు నచ్చచెప్పినా ఆయన తన ఆలోచనలు మార్చుకోలేదు. చంద్రబాబు విశాఖ పర్యటనలో బండారు ని పిలిపించి మాట్లాడారు. పొత్తులలో భాగంగా సీటు జనసేనకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.

ఈ సందర్భంగా బండారుకు బాబుకు మధ్య కొంత వాదనలు జరిగాయని అంటున్నారు. బాబు సరైన హామీ ఇవ్వకుండా బండారుని తగ్గమని పనిచేయమని కోరడంతో తన వల్ల కాదని ఆయన చెప్పేశారు అంటున్నారు. పెందుర్తి నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్న   జనసేనకు ఈ పరిణామాలు కలవరపెట్టేలా ఉన్నాయని అంటున్నారు.

సీనియర్ నేత బండారు దారికి రాకపోతే మాత్రం పెందుర్తిలో గాజు గ్లాస్ కి బీటలే అంటున్నారు. నేల మీద పడితే పదునెక్కడం అటుంచి పగిలిపోతుంది అని అంటున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి అనుకూలించేవే అంటున్నారు. బండారు ఏడు పదుల వయసులో పార్టీ హై కమాండ్ ద్వారా తీరని అవమానానికి గురి అయ్యారని అంటున్నారు.

ఆయన 2014లో గెలిస్తే మంత్రి పదవి విస్తరణలో కూడా ఇవ్వలేదని ఈసారి టికెట్ కూడా ఇవ్వలేదని ఆయన రాజకీయాన్ని అధినాయకత్వం ఏమి చేయనుందని అనుచరులు అంటున్నారు. ప్రస్తుతానికి అయితే బండారు అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఆయన ఫోన్ లోకి అందుబాటులోకి రావడం లేదు. దాంతో కూటమికి బండారు భారీ షాక్ ఇస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.

Show comments