ఇటీవలే అనంతపురం జిల్లాలో ట్రెజరీలో పని చేసే ఒక ఉద్యోగి అవినీతి బాగోతం విస్తుగొలిపింది. తండ్రి పోవడంతో కారుణ్య నియామకాల్లో ఉద్యోగం పొందిన ఒక అధికారి భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడి, ఆస్తులను కూడగట్టి దొరికిపోయాడు. తాజాగా తెలంగాణ పరిధిలో నరసింహారెడ్డి అనే ఏసీపీ ఆస్తులు అత్యంత భారీగా ఉన్నాయనే విషయం బయటపడింది. ఏకంగా 25 బృందాలుగా ఏసీబీ ఇతడి ఆస్తుల మీద దృష్టి సారించాల్సి వచ్చిందంటే.. ఈ ఘనుడి ఘనతను అర్థం చేసుకోవచ్చు.
మల్కాజ్ గిరి ఏసీపీగా పని చేస్తున్న నరసింహారెడ్డి అనే పోలీసు అధికారి ఆస్తుల విలువ అక్షరాలా 100 కోట్ల రూపాయలకు పై మాటే అని ఏసీబీ వర్గాలు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల వ్యాప్తంగా ఆయన భారీగా ఆస్తులను కూడగట్టినట్టుగా ఏసీబీ వర్గాలు గుర్తించాయి. పదుల ఎకరాల్లో భూములు కొనుగోలు చేశాడట ఆ అధికారి.
విశేషం ఏమిటంటే.. తన గొప్పలు చెప్పుకుంటూనే ఇతడు ఏసీబీ దృష్టిలో పడ్డాడట. తన ను ఎవరూ ఏం చేయలేరని, తన వెనుక పోలిస్ బాస్ డీజీపీ నే ఉన్నాడంటూ తరచూ తన సన్నిహితుల వద్ద చెప్పుకునేవాడట ఈ ఏసీపీ. ఈ క్రమంలో ఈ మాట పోలీస్ ఉన్నతాధికారుల వరకూ వెళ్లడం, వాళ్లే ఏసీబీకి సమాచారం ఇచ్చి నరసింహారెడ్డి పై ఓ చూపు చూడాలని సూచించారట. ఈ క్రమంలో ఆయన అడ్డంగా బుక్ అయినట్టుగా తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధాన మీడియా వర్గాలు కవర్ చేయని అంశం మరోటి కూడా ఉందని ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. ఈ ఏసీపీతో తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలకు కూడా సన్నిహిత సంబంధాలున్నాయట. వీరు జాయింటుగా కొన్ని ఆస్తులను కలిగి ఉన్నారని ఏసీపీ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఏసీపీ బినామీల వద్ద దొరికిన ఆస్తుల్లో కొందరు రాజకీయ నేతలకు కూడా వాటాలున్నాయని తెలుస్తోంది.
అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయభూమి, సైబర్టవర్ ఎదుట నాలుగు ప్లాట్లు, హఫీజ్పేటలో మూడంతస్తుల బిల్డింగ్, రెండు ఓపెన్ ప్లాట్లు, మరో రెండు ఇళ్లు..ఇంకా నగదు, రియలెస్టేట్ లో పెట్టుబడులు.. ఇవి నరసింహా రెడ్డి అండ్ కో వద్ద ఏసీబీ గుర్తించిన ఆస్తులు.