గీతం విద్యా సంస్థలకు దసరా వేళ నుంచి రోజులు బాగున్నట్లుగా లేవేమో. అందుకే ఎన్నడూ ఆ వైపుగా తొంగి చూడని అధికారులు ఒక్కసారిగా జేసీబీలు తీసుకుని మరీ కూల్చుడు కార్యక్రమం మొదలెట్టారు. దాని మీద స్టే తెచ్చుకున్న గీతం మొత్తం 43 ఎకరాల భూమి కోసం ఇంకా న్యాయ పోరాటం చేస్తోంది.
ఈలోగా గీతం మెడికల్ కాలేజ్ మీద ఎంపీ విజయసాయిరెడ్డి జాతీయ వైద్య మండలికి లేఖ రాశారు. భూముల విషయంలో సరైన డాక్యుమెంట్లు చూపించని గీతంకి ఇచ్చిన అనుమతుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అందులో గట్టిగా కోరారు.
ఇపుడు విశాఖలోని ప్రజాసంఘాలు కూడా గీతం విషయంలో గరం గరం కావడం విశేష పరిణామం. వారు కూడా ఎంపీ విజయసాయిరెడ్డి తరహాలోనే ఫిర్యాదు చేస్తున్నారు. మెడికల్ కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని, దాని మీద విచారణ జరిపించాలని కోరడం విశేషం.
మరో వైపు ఏకంగా ఈడీకే గీతం మీద ప్రజాసంఘాల నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. గీతంకి వచ్చిన విదేశీ విరాళాల మీద విచారణ జరిపించాలని కూడా కోరడం విశేషం. గీతం తీసుకున్న బ్యాంక్ రుణాల విషయంలో కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇపుడు ప్రభుత్వ భూమి ఆక్రమణ కాదు కానీ చాలా విషయాలు గీతం గురించి బయటకు రావడం అంటే అంత పెద్ద సంస్థ చిక్కుల్లో పడినట్లే మరి. చూడాలి ఏం జరుగుతుందో.