తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మరింత సమయం ఉంది. వచ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. చాలా కాలం తర్వాత జయలలిత, కరుణానిధి లేకుండా జరగబోయే ఎన్నికలుగా వచ్చే ఎన్నికలు ప్రత్యేకం. గత నాలుగేళ్లలో తమిళనాడు రాజకీయాల ముఖచిత్రమే మారిపోయింది. జనంలో పట్టున్న లీడర్లు కాకుండా, నామినేటెడ్ నేతల మధ్య రకరకాలుగా రాజకీయ పోరు సాగుతూ ఉందక్కడ.
ప్రత్యేకించి అన్నాడీఎంకేలో పోరు వానపాముల ఆటగా మారింది. జయలలిత మరణానంతరం ఆ పార్టీలో అనేక రకాల పరిణామాలు సంభవించాయి. మిత్రులు శత్రువులయ్యారు. ఆ తర్వాత మిత్రులయ్యారు. శశికళ ఆశీస్సులతో సీఎం అయిన పళనిస్వామి ఆమె జైలుకు వెళ్లాకా పూర్తిగా బీజేపీకి దగ్గరయ్యారు. శశి జైలుకు వెళ్లడంతో ఓపీఎస్, ఈపీఎస్ లు బీజేపీ సూచనల మేరకు ఒకరు అధికారాన్ని పంచుకుని సాగుతూ ఉన్నారు.
అయితే ఇప్పుడు వీరి మధ్యన కూడా అభిప్రాయ బేధాలు వచ్చినట్టుగా ఉన్నాయి. ఒకవైపు శశికళ విడుదలకు సమయం ఆసన్నమవుతోందనే వార్తల నేపథ్యంలో వీరు మళ్లీ కత్తులు దూసుకుంటున్నట్టుగా ఉన్నారు. వీళ్ల గొడవ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశం గురించినట!
వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున తను సీఎం అభ్యర్థిని అంటే, తను సీఎం అభ్యర్థినంటూ వీళ్లు అప్పుడే రచ్చ మొదలుపెట్టారట. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుపు మీద ఆ పార్టీ అభిమానులకు అయినా ఆశలున్నాయా? అనేది కీలకమైన అంశం. దాని గురించి ఆలోచించకుండా వీళ్లు సీఎం అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారట!
తనను జయలలిత సీఎంని చేసిందంటూ పన్నీరు సెల్వం అంటుంటే, తనను చిన్నమ్మ శశికళ సీఎంను చేసిందంటూ పళనిస్వామి అంటున్నారట. తననే కాదు, జయలలితను సీఎంను చేసింది కూడా శశికళే అంటున్నాడట ఈయన.
ఈపీఎస్ తీరు చూస్తుంటే మళ్లీ శశికళ భక్తుడులాగా మాట్లాడుతున్నట్టున్నాడు. శశికళే ఆయనను సీఎంగా చేసింది. తీరా పరిణామాలు అడ్డం తిరిగే సరికి శశికి అతడు దూరం అయ్యాడు. ఇప్పుడు శశి విడుదల కాబోతున్న నేపథ్యంలో మళ్లీ ఆమెకు అనుకూలంగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు పళనిస్వామి. మొత్తానికి ఇతడూ ఘటికుడిలానే ఉన్నాడు!