బీజేపీ.. వాపా? బలుపా!

-ఏపీలో కమలం పార్టీకి భవితవ్యం?
-వలసలు, చేరికలతో ఉపయోగం ఎంత?
-ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే పరిస్థితి ఏమిటి?
-టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?
-చంద్రబాబుకు సంకటం, బీజేపీకి చెలగాటం!

కొండకు వెంట్రుక వేసే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. వస్తే కొండ, పోతే వెంట్రుక! మరోసారి ఏపీలో భారతీయ జనతా పార్టీకి దారుణమైన పరాజయమే ఎదురైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఏపీలో బీజేపీకి పెద్దగా దక్కుతున్న సీట్లు, పడుతున్న ఓట్లు ఏమీలేవు. అయితే అప్పుడంతా పొత్తులతో వెళ్లడం, ఏపీ ఉమ్మడిగా ఉండటంతో కమలం పార్టీకి అసెంబ్లీలో కొద్దోగొప్పో ప్రాతినిధ్యం లభించేది, లోక్‌సభకు ఏపీ నుంచి బీజేపీ ఎంపీలు వెళ్లేవారు! అయితే రాష్ట్ర విభజనతో కమలం పార్టీకి ఏదైనా వైభవం ఉంటే అది తెలంగాణకు మాత్రమే పరిమితం అయ్యింది. ఏపీలో గత ఎన్నికల్లో తెలుగుదేశం  పార్టీలో పొత్తు పెట్టుకుని నామమాత్రపు ప్రాతినిధ్యాన్ని అయినా బీజేపీ పొందింది. అయితే ఈసారి పొత్తులు లేకపోవడం, ప్రత్యేకహోదా  విషయంలో ఏపీని మోసం చేయడం.. ఈ రెండు రీజన్లు కమలం పార్టీని మరింత పతనావస్థకు చేర్చాయి.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దక్కిన ఓట్లు అక్షరాల రెండు లక్షల అరవై వేల చిల్లర ఓట్లు. మూడు కోట్ల మందికి పైగా ఏపీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే.. అందులో బీజేపీ వాటా రెండు లక్షల అరవై వేల స్థాయి అంటే ఏపీలో బీజేపీకి ఎదురైనది ఎంతటి దారుణ పరాభవమో ఇక వేరే వివరించనక్కర్లేదు. కేవలం 0.84శాతం ఓట్లు బీజేపీకి దక్కాయి. ఏపీని విభజించిన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇవే ఎన్నికల్లో 1.17 శాతం ఓట్లను సంపాదించుకుంది. ఏపీలో నోటాకు పడిన ఓట్లు 1.28 శాతం. భారతీయ జనతా పార్టీకి దక్కిన ఓట్ల శాతం మాత్రం 0.84! కాంగ్రెస్‌ పార్టీ, నోటాలు కూడా భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువ ఓట్ల శాతాన్ని సంపాదించుకోవడాన్ని గమనించవచ్చు.

కాంగ్రెస్‌ పార్టీ, నోటాలు కూడా భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువ ఓట్ల శాతాన్ని సంపాదించుకోవడాన్ని గమనించవచ్చు. సాధారణంగా ఇలాంటి ఫలితం పొందిన పార్టీ ఏదైనా ఆ తర్వాత మారు మాట్లాడలేదు! పోల్‌ అయిన  ఓట్లలో కనీసం ఒక్కశాతం ఓట్లను పొందని పార్టీ ఆ తర్వాత ప్రజల గురించి మాట్లాడినా, రాజకీయంగా ఏదైనా అలికిడి చేసినా అంతకన్నా కామెడీ ఉండదు. కానీ బీజేపీ ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉండటమే అంతకు మించిన ప్రహసనం!

చేరికలతో కమలం పార్టీ బలోపేతం అవుతుందా?
చేరికలతో బీజేపీ బలోపేతం అవుతుందా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే చేరినవారు ఎవరు? వారి రాజకీయ స్థాయి ఎంత? వారికి ఉన్న  ప్రజాబలం ఎంతా? అనే అంశాల గురించి విశ్లేషించాలి. భారతీయ జనతా పార్టీ ఏపీలో చేరికలనే నమ్ముకుంది. నేతలు వచ్చిచేరితే తమ పార్టీ బలోపేతం అవుతుందని, అవుతోందని.. ఏపీలో భవితవ్యం తమదే అని కమలం పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ ప్రబల శక్తిగా ఎదుగుతుందని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని, భవిష్యత్తులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీలను చిత్తుచేసి తామే ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకోబోతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం సాధించడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తన చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయి దారుణ పరాజయం పాలవ్వడం.. ఈ పరిణామాల్లో బీజేపీ నేతలు తొడలు కొడుతున్నారు, మీసాలు మెలేస్తూ ఉన్నారు! అందుకు తగ్గట్టుగా నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి చేరడం, ఇంకా అనేకమంది తెలుగుదేశం పార్టీ నేతలు కమలం పార్టీ వైపు చూస్తూ ఉండటం.. వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఈ చేరికలతో తాము బలోపేతం కాబోతున్నట్టుగా వారు చెబుతూ ఉన్నారు!

ప్రజలతో సంబంధం ఉన్న వాళ్లేనా..?
నలుగురు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీని వీడి చేరడంతో బీజేపీ చాలా పొంగిపోతూ ఉంది. ఆ చేరికలకు ఆమోదముద్ర వేసింది ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అంతకు ముందంతా ఆయన ఫిరాయింపుల విషయంలో చెప్పిన నీతులు విన్న ఏపీ ప్రజలు, ఆయనే ఆ ఫిరాయింపులకు రాజముద్ర వేయడంతో అవాక్కయ్యారు! అన్ని నీతులు  చెప్పారు కదా వెంకయ్య.. విలీనం అంటూ ఈ అనైతిక చర్య ఏమిటని సోషల్‌  మీడియాలో ప్రశ్నలు వేశారు. అయితే మాటెత్తితే భారతీయ విలువలు అంటూ మాట్లాడే బీజేపీ వాళ్లకు మాత్రం తమ రాజకీయంలో నైతికత గురించి గుర్తుకురాలేదు! భారతీయ విలువల్లో రాజకీయ నైతికత ఉండదా? రాజకీయ నైతికత గురించి వాజ్‌పేయిని ఉదాహరించే బీజేపీ ఇప్పుడు ఇలాంటి ఫిరాయింపు రాజకీయాలను చేస్తూ ఉంది.

సరే.. ఫిరాయింపులకు రాజముద్ర వేశారు. అంతా రాజ్యాంగబద్ధమే అన్నారు. అయితే అలా ఫిరాయించిన వారికి ప్రజలతో ఏమైనా సంబంధం ఉందా? వాళ్లకు ఉన్న ప్రజాబలం ఎంత? అనేది పరిశీలించాల్సిన అంశం. ఆ నలుగురిలో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఎగ్గొట్టినవారు, భారీగా బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుని వ్యాపారం అంటూ ఇన్వెస్ట్‌ చేసి వాటిని రీ పే చేయలేని దశలో ఉన్న వ్యక్తి, మరో కాంట్రాక్టర్‌.. ఇదీ వాళ్ల చరిత్ర! వాళ్లు పోటీచేస్తే కనీసం పంచాయితీ ప్రెసిడెంట్‌గా నెగ్గడం కూడా కష్టమే! అలాంటి ఎంపీలను భారతీయ జనతా పార్టీ చేర్చుకుంది.

రాజ్యసభలో బీజేపీ బలం కొన్నాళ్లు పెరగడానికి తప్ప.. ఆ చేరికలతో బీజేపీకి అనాపైసా ఉపయోగం ఉండకపోవచ్చు. అన్నింటికి మించిన అంశం ఏమిటంటే.. వాళ్లను చంద్రబాబు నాయుడే బీజేపీలోకి పంపారనే ప్రచారం జరగడం. కేవలం ఢిల్లీలో అధికార పార్టీలో తన వాళ్లు కొందరు ఉండాలనే లెక్కలతో చంద్రబాబు నాయుడే వాళ్లను బీజేపీలోకి పంపారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో తాము పట్టిన చేపల విలువ ఏమిటో కమలం పార్టీకే తెలియాలి. కేవలం వారి వ్యక్తి గత స్వార్థం కోసం బీజేపీలోకి చేరిన నేతలతో ఆ పార్టీ బలోపేతం అవుతుందని ఎవరైనా చెబుతుంటే.. వాళ్లను పిచ్చోళ్లలా చూస్తున్నారు  ఏపీ ప్రజలు!

ఎమ్మెల్యేలు చేరతారా?
చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులకూ ఏ నియోజకవర్గంలోనూ పట్టుమని పదిఓట్లు లేకపోవచ్చు. వారి చేరికలు ఆరంభం మాత్రమే.. తాము తెలుగుదేశం పార్టీ పార్టీకి ప్రత్యామ్నాయం అయిపోవడానికి ఆ చేరికలు ఆరంభం మాత్రమే.. ముందు ముందు మరిన్ని చేరికలకు అవి నాంది మాత్రమే.. అనేది బీజేపీ తరఫున వినిపిస్తున్న మరోవాదన. రాజ్యసభలో నలుగురు ఎంపీలను చేర్చుకోవడంతో మొదలైన రాజకీయం ముందు ముందు ఏపీ  అసెంబ్లీలో తామే ప్రతిపక్షంగా కూర్చునేంత వరకూ వెళ్తుందని కమలనాథులు చెబుతూ ఉన్నారు. టీడీపీ నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కమలంపార్టీ జాతీయనేతలు ఏపీకి వచ్చి ప్రకటించి వెళ్తున్నారు! అది ఎంతవరకూ నిజమో తెలియదు. కొంతమంది ఎమ్మెల్యేలు  ఫిరాయించే అవకాశాలు లేకపోలేదు.

పొంచి ఉన్న అనర్హత వేటు భయం!
ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో టచ్లోకి వెళ్లినట్టుగా, వారితో సంప్రదింపులు చేసి చేరడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటుపడే అవకాశాలు లేకపోలేదు! ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ ఈ విషయంలో గట్టిగా చెప్పింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులను సహించేది లేదని స్వయంగా అధికార పార్టీనే చెప్పింది. ఇప్పటికిప్పుడు సీఎం జగన్‌ పిలిస్తే సగంమంది టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిపోయేందుకు రెడీగానే ఉన్నారు.

అయితే జగన్‌ అలాంటి రాజకీయాలకు నో అంటున్నారు. తన విషయంలోనే అలాంటి నియమాలను పెట్టుకుని రాజకీయం చేస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయిస్తే అలాంటి రాజకీయాలను జరగనీయకపోవచ్చు. పూర్తి అధికారం స్పీకర్‌దే అనేశారు. కాబట్టి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బీజేపీకి చేరితే ఉప ఎన్నికలు తప్పకపోవచ్చు. వాటిల్లో గెలుస్తామనే నమ్మకం ఉంటే.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవచ్చు. బీజేపీకి ఇప్పుడున్న మరోమార్గం విలీనం. పదహారు మంది ఎమ్మెల్యేలు ఒకేసారి కండువాలు మార్చుకుంటే అప్పుడు బీజేపీకి కొంత సౌలభ్యం ఉంటుంది.

అయితే అప్పుడు కూడా అనర్హత వేటుపడినా పడొచ్చు. ఎందుకంటే.. విలీనాలు అనేవి నిఖార్సైన రాజకీయంలో లేవు. విలీనాలు అనేవి ఎన్నికల సంఘం ద్వారా జరగాలి కానీ చట్టసభల నుంచి కాదు. కాబట్టి.. పదహారు మంది ఫిరాయించినా వారందరి మీదా అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అయితే అలాంటప్పుడు కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాజ్యసభలోనూ, పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో అలాంటి విలీనాలు జరిగాయి కాబట్టి, తమ విలీనాన్ని ఆమోదించాలని బీజేపీ కోర్టుకు వెళ్లవచ్చు. అయితే పదహారు మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రెడీ అవుతారా? అనేది శేష ప్రశ్న.

అందరూ అందరే!
కొంతమంది ఓడిపోయిన నేతలు బీజేపీలోకి చేరారు, చేరుతున్నారు. వారికి ఎలాంటి అనుమతులూ, అనర్హత వేట్లు ఉండవు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేలుగా వారు ఓడిపోయారు. ప్రజలు వారిని తిరస్కరించారు. కాబట్టి వాళ్లు బీజేపీలోకి చేరినా వారికి అడ్డంకులు లేవు. అయితే ఇలాంటివారు మాత్రం పూర్తిగా వ్యక్తిగత స్వార్థంతోనే చేరుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చేతిలో అధికారం ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడిన బాపతు వీళ్లంతా. తమ అక్రమాలపై కేసులు, విచారణలను తప్పించుకోవడానికే వారు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

అరెస్టులు, కేసుల భయంతోనే కాషాయ కండువాలు వేసుకుంటున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు అలాంటివారు చేయని అక్రమం అంటూలేదు. పాల్పడని అనైతిక చేష్టలులేవు. అందుకే ఇప్పుడు అధికారం చేజారేసరికి వారికి భయం పట్టుకుంది. అందుకే బీజేపీ మంత్రం పఠిస్తున్నారు. అలాంటి అక్రమార్కులకు కాషాయ కండువా వేసి, వారిని దేశభక్తులుగా చేస్తున్నారు బీజేపీవాళ్లు! అలాంటి వాళ్లు ఇక నుంచి చెప్పే దేశభక్తి పాఠాలు, చెప్పే నీతి సూక్తులు విని ఏపీ ప్రజలు బీజేపీకి జై కొట్టాలన్నమాట!

నేతలు చేరితే ఏమవుతుంది?
రాజ్యసభ సభ్యులు  ఫిరాయిస్తేనో, ఓడిపోయినవాళ్లు వెళ్లి చేరితేనో.. బీజేపీ పెరిగేబలం ఎంతో చెప్పాలంటే కొన్ని పాత ఉదాహరణలూ ప్రస్తావించాలి. అందులో భాగంగా గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసిన తీరును ప్రస్తావించాలి. ఏకంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి చేర్చుకున్నారు!  కట్‌ చేస్తే  తెలుగుదేశం పార్టీకి మిగిలింది అదే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు, అదే ముగ్గురు ఎంపీలు! ఇప్పుడు వాళ్లందరినీ బీజేపీ చేర్చుకున్నా.. కమలం పార్టీ ప్రస్తుత స్థితి అంటే సున్నా ఎమ్మెల్యే సీట్లు, సున్నా ఎంపీ సీట్లుకు మించి మెరుగుపడకపోవచ్చేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.

రాష్ట్రానికి మోసం చేస్తారు, ఓట్లు వేయాలా?
సీమాంధ్ర సహిత ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఎంత మోసం, ద్రోహం చేసిందో అంతే స్థాయిలో భారతీయ జనతా పార్టీ కూడా వ్యవహరించింది. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రాష్ట్ర విభజనకు బీజేపీ గట్టిగా మద్దతు పలికింది. విభజన సమయంలో సీమాంధ్ర  ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి బీజేపీ మరింత మోసమే చేసింది. కాంగ్రెస్‌ వాళ్లు విభజన చేసి.. కనీసం ఏపీకి ప్రత్యేకహోదా  అనే ఒకమాట అన్నారు. దాన్ని కేబినెట్లో పెట్టారు. ఇక అదే ప్రత్యేకహోదాను ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు ఇస్తామంటూ భారతీయ జనతా పార్టీ మరో మోసానికి ఒడికట్టింది.

తీరా కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్నాకా చంద్రబాబుతో కలిసి బీజేపీ మోసానికి పాల్పడింది. ఇప్పుడేమో హోదా ముగిసిన అధ్యాయం, ఆ పేరు ఎత్తితే ప్రజలను మోసం చేయడమే అంటూ కమలం పార్టీ నేతలు కుట్ర పూరిత మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారం సొంతం చేసుకుందేమో కానీ, ఏపీలో మాత్రం ఎక్కడా డిపాజిట్‌ రాలేదనే విషయాన్ని మరిచివారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ నియోజకవర్గంలోనూ కనీసం వెయ్యి ఓట్లు పొందలేనివాళ్లు ఇప్పుడు  రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది వాళ్ల పరిస్థితి.

అయినా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలానే వాళ్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి మాట్లాడుతూ తామే ఏపీలో ఎలా ప్రత్యామ్నాయం అవుతామని వారు ఎలా అనుకుంటున్నారో వారికే తెలియాలి! ఇక కమలం పార్టీ తన మార్కు రాజకీయం చేయడానికి, అమిత్‌ షా స్ట్రాటజీలు వర్కవుట్‌ చేయడానికి.. అనుకూల మతపరమైన రాజకీయానికి కూడా ఏపీలో అంత అవకాశం లేదు! మతపరంగా రచ్చలు రేగే పరిస్థితి ఉన్నచోటే కమలం పార్టీ తొందరగా తన ఉనికిని చాటుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఏపీలో అలాంటి పరిస్థితులు అంతగా లేవు. కాబట్టి అలా పాగా వేయడానికి అవకాశాలు లేవు.

ఇప్పుడు చేయాల్సింది అదే!
నేతల ఫిరాయింపులతోనో, తెలుగుదేశం పార్టీ నేతలను చేర్చుకోవడం ద్వారానో బీజేపీది వాపే కాని, బలుపుకాదు! ఆ వాపు ఇప్పుడు ఉంటుంది రేపు తగ్గిపోతుంది. ఈ వాపుతోనే బీజేపీ స్పోక్‌ పర్సన్లు కైపు ఎక్కినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏపీ మీద అథారిటీ చెలాయించేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. తమకు ఏపీలో దక్కింది 0.84శాతం ఓట్లేనని వారు గుర్తు పెట్టుకోవాలి. ఈ స్థాయిని పెంచుకోవాలంటే.. ఏపీకి న్యాయం చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రత్యేకహోదా విషయంలో తమ తప్పులను సరిద్దుకోవాలి. ఏపీకి ప్రత్యేకహోదాను ప్రకటించాలి. ఇచ్చినమాటను ఇప్పటికైనా నిలబెట్టుకున్నట్టుగా చెప్పుకోవాలి. అప్పుడు కమలం పార్టీకి ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది.

ఎలాగూ తెలుగుదేశం పార్టీ పతనాసవస్థలో కొట్టుమిట్టాడుతూ ఉంది. చంద్రబాబుకు వయసు మీద పడుతూ ఉంది. లోకేష్‌ సంగతి సరేసరి! లోకేష్‌ నాయకత్వాన్ని ఇప్పుడున్న టీడీపీవాళ్లు కూడా ఒప్పుకోలేని పరిస్థితి ఉంది. పార్టీ వ్యతిరేక గాలిలో తాము ఎమ్మెల్యేలుగా అయినా గెలించామని, కనీసం  ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన చంద్రబాబు నాయుడు తనయుడు తమ మీద అథారిటీని చెలాయించడాన్ని వారు సహించలేకపోవచ్చు. తెలుగుదేశం అనుకూలమైన కులంలోని ప్రముఖులు బీజేపీ వైపు ట్రాన్స్‌ఫర్‌ కావడానికి రెడీగానే కనిపిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్యన ముందుగా రాష్ట్రానికి ఏదైనా ఒక గట్టి మేలు తలపెట్టాలి బీజేపీ. అది ప్రత్యేకహోదానే. ఆ విషయంలో సానుకూలంగా వ్యవహరించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడి.. ఆ తర్వాత రాజకీయంగా ఏం చేసినా చెల్లుతుంది!

రాష్ట్రం తరఫున మాట్లాడే హక్కు బీజేపీకి సంక్రమిస్తుంది. ప్రజల్లో కమలం పార్టీపై సానుకూల భావన ఏర్పడుతుంది. అలా చేయకుండా.. ఒకవైపు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నట్టుగానే మాట్లాడుతూ, స్వార్థపూరిత నేతలను చేర్చుకుంటూపోతూ బీజేపీ మరింత వ్యతిరేకత పెంచుకోవడమే తప్ప అంతకు మించిన ప్రయోజనం ఉండదు. ఈ విషయాలు కమలనాథులకు తెలియవని కావు. అయితే ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలేమో పూర్తి అతివిశ్వాసానికి వెళ్లిపోయినట్టున్నారు. రాష్ట్రస్థాయి నేతలు వారిని అలరించడానికి మాట్లాడుతూ ఉంటారు! అదీ కథ!
-జీవన్‌ రెడ్డి.బి

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు

Show comments