రెండేళ్ల కిందట విడుదల అయిన అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలో ఇప్పుడు హిందీలోకి డబ్ అవుతూ ఉంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నెల ఇరవై ఆరో తేదీన ఈ సినిమా హిందీ డబ్డ్ వెర్షన్ విడుదల కాబోతోంది.
పుష్ప సినిమా హిందీలో విడుదల అనంతరం ఇప్పుడు ఈ పాత సినిమా వేగంగానే డబ్ అయ్యి హిందీలో విడుదల అవుతున్నట్టుగా ఉంది. అయితే విశేషం ఏమిటంటే.. రెండేళ్ల కిందటే ఈ సినిమా హిందీ రీమేక్ వార్తలు వచ్చాయి. తెలుగులో హిట్ అయిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టుగా అప్పట్లో హడావుడి జరిగింది.
ఫస్ట్ వేవ్ కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా హిందీ రీమేక్ గురించి చర్చలు జరిగాయి. హిందీలో ఇద్దరు హీరోలను పెట్టి అల్లు అరవింద్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఇక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడమే తరువాయి అనే దశ నుంచి మళ్లీ ఆ ఊసులు ఆగిపోయాయి.
రెండేళ్ల కరోనా పరిణామాలతో ఈ సినిమా హిందీ రీమేక్ వార్తల్లో లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కు డైరెక్టు హిందీ మార్కెట్ మీద మోజు పుట్టిందో ఏమో కానీ, తెలుగు వెర్షన్ నే డబ్ చేశారు.
రీమేక్ చర్చలు జరిగినా, ఇన్నాళ్లు ఆపిన సినిమాను ఇప్పుడు డబ్ చేయడం అంటే.. బహుశా ఇది కచ్చితంగా అల్లు అర్జున్ స్ట్రాటజీనే అయి ఉండాలి! అయితే ఎటొచ్చీ మరో పది రోజుల్లో విడుదల అంటే.. ఈ సమయంలో రెండేళ్ల కిందటి డబ్బింగ్ సినిమాను చూసేందుకు థియేటర్లకు ఎగబడే హిందీ జనాలుంటారా? అని!