బీజేపీతో పొత్తు పెట్టుకుంటే... టీడీపీ నేతలు భయపడినట్టే జరుగుతోంది. కేసుల నుంచి తన రక్షణ నిమిత్తం చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని సొంత పార్టీ నేతలు సైతం అంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీలో చంద్రబాబునాయుడు, లోకేశ్కు మినహా మరెవరికీ ఇష్టం లేదు. బీజేపీతో పొత్తు కుదర్చడంతో తాను కీలక పాత్ర పోషించానని పదేపదే చెబుతున్న పవన్కల్యాణ్పై కూడా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి.
ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలు వ్యవహరిస్తున్న తీరు పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటంలా తయారైంది. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని మోదీ, అమిత్షా, ఇతర బీజేపీ ముఖ్య నేతలు బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ తన మేనిఫెస్టోలో సైతం పొందుపరిచింది. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ముస్లింలు రగిలిపోతున్నారు.
దివంగత వైఎస్సార్ హయాంలో కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తే, తాము భారీగా నష్టపోతామని ముస్లింలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బీజేపీతో పాటు ఆ పార్టీతో అంటకాగుతున్న టీడీపీ, జనసేనలపై ముస్లింలు రగిలిపోతున్నారు. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్షా ఎన్నికల ప్రచారాల్లో చెబుతుంటే, టీడీపీ, జనసేన నేతలెవరూ ఖండించకపోవడం ఏంటని ముస్లింలు నిలదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇంత కాలం టీడీపీ, జనసేనకు అక్కడక్కడ అండగా నిలిచిన ముస్లింలు సైతం ఆ రెండు పార్టీలకు దూరమయ్యే పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపోటములను నిర్ణయిస్తారు. అలాంటి చోట కూటమి రాజకీయంగా చావు దెబ్బ తినకతప్పదనే భయం వెంటాడుతోంది.
ఏది ఏమైనా కూటమికి బీజేపీ ఉరి తాడు బిగిస్తోందనే విమర్శ వెల్లువెత్తుతోంది. ముస్లింల రిజర్వేషన్ల అంశం కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మోదీ, అమిత్షా అభిప్రాయాల్ని ఖండించే దమ్ము, ధైర్యం బాబు, పవన్కు లేవు. అందుకే భారీ మూల్యాన్ని చెల్లించుకోడానికి సిద్ధపడుతున్నారని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.