హుజూర్ నగర్ పై వైఎస్సార్సీపీ చూపు..?

తెలంగాణ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉండనే ఉంది. తెలంగాణ ఏర్పడ్డాకా తొలి సారి సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఎంపీ సీటును, మూడు ఎమ్మెల్యే సీట్లను ఆ పార్టీ నెగ్గింది. అయితే అప్పుడు ఏపీలో అధికారంలోకి రాలేకపోవడంతో.. తెలంగాణను జగన్ పూర్తిగా గాలికి వదిలేయాల్సి వచ్చింది.

అయితే తెలంగాణలో తమ ఉనికి ఉండనే ఉంటుందని జగన్ ఇటీవల కూడా ప్రకటించారు. ఏపీలో నిలదొక్కుకున్నాకా..తెలంగాణలో పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. అక్కడ తమకు ఓటు బ్యాంక్ ఉందని జగన్ స్పష్టం చేశారు. మరిన్ని కీలక వ్యాఖ్యానాలు కూడా చేశారాయన.

తెలంగాణలో వైసీపీ పోటీ చేయకుండా కేసీఆర్ కు సహకారం అందిస్తోందని చంద్రబాబు ఆరోపించగా, జగన్ ఘాటుగా స్పందించారు. తాము పోటీ చేస్తే ముప్పు చంద్రబాబు దోస్తు కాంగ్రెస్ కే అని జగన్ వ్యాఖ్యానించారు. తాము అభ్యర్థులను పోటీలో పెట్టి ఉంటే..గెలుస్తామా లేదా అనే సంగతిని పక్కన పెడితే, హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నెగ్గే అవకాశాలు ఉండేవి కావని, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ అవకాశాలు దెబ్బతినేవని జగన్ విశ్లేషించారు.

బహుశా ఇప్పుడు  అందుకు సమయం వచ్చినట్టుగా ఉంది. హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక రానే వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా వెళ్లిపోవడంతో..అక్కడ బై పోల్  జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో అదే సీట్లో వైసీపీ పోటీ చేస్తే కథ రసవత్తరంగా మారుతుంది. ఏపీలో జగన్ తమకు ప్రధాన శత్రువంటూ ప్రకటించుకున్నారు కాంగ్రెస్ మూర్ఖాగ్రేసరులు. ఇలాంటి నేపథ్యంలో హుజూర్ నగర్ లో జగన్ తన పార్టీ అభ్యర్థిని పోటీ చేయిస్తే.. అప్పుడు కానీ కాంగ్రెస్ వాళ్లకు కళ్లు బైర్లు కమ్మవు!

Show comments