పాదయాత్ర ముగింపు సందర్భంగా ఒకేసారి భారీ ఎత్తున అభ్యర్థుల ప్రకటన చేయాలని.. దాన్నొక సంచలనంగా నిలపాలని తాము అనుకోవడం లేదని అన్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. అభ్యర్థుల ప్రకటన విషయంలో తొందరేమీ లేదన్నట్టుగా జగన్ వ్యాఖ్యానించాడు. పాదయాత్ర ముగింపు సభలో జగన్ ఒకేసారి వందకు పైగా స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయనున్నాడని మొదట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ అంశంపై స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని స్పష్టంచేశాడు.
అభ్యర్థుల ఎంపిక గురించి కసరత్తు కొనసాగుతూ ఉన్నట్టుగా జగన్ పేర్కొన్నాడు. పాదయాత్రను కొనసాగిస్తూనే.. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కసరత్తును కొసాగించినట్టుగా జగన్ పేర్కొన్నాడు. పార్లమెంటరీ నియోజకవర్గాలకూ, అసెంబ్లీ నియోజకవర్గాలకూ అభ్యర్థుల ఎంపిక కొనసాగుతూ ఉందని.. ఈ విషయంలో సంప్రదింపులు, సర్వేలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా జగన్ తెలిపాడు.
ఇక కేంద్రంలో పొత్తు విషయంలో ప్రత్యేకహోదా మాత్రమే అజెండా అని జగన్ వ్యాఖ్యానించాడు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీలకే మద్దతు అని స్పష్టం చేశాడు. ఈ విషయంలో మరో ఆలోచన లేదు అని జగన్ వ్యాఖ్యానించాడు.
ఎన్నికల మేనేజ్ మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు పండిపోయాడు కదా.. అనే అంశం మీద కూడా జగన్ స్పందించాడు. గెలిచిన వారిని మేధావి అనడం, ఓడిన వారి విషయంలో ఏవో వ్యాఖ్యానాలు చేయడం మామూలే అని, చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో నెగ్గాడు కాబట్టి.. ఆయన విషయంలో అలాంటి వ్యాఖ్యానాలు వినిపిస్తాయని.. జగన్ అభిప్రాయపడ్డాడు.
రేపటి ఎన్నికల్లో కూడా బాబు ఏదో మేనేజ్ చేసేస్తాడనే భయం తమకేమీ లేదని జగన్ ఇలా పరోక్షంగా చెప్పాడు.