వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి కూడా లేనంత ద్వేషం ఈనాడు తోక పత్రిక నింపుకుంది. నిత్యం విషపు సిరాతో రాతలు రాయడమే ఆ అంధ పత్రిక పనిగా పెట్టుకుంది. చివరికి ఈ ద్వేషం ఏ స్థాయికి దిగజారిందంటే... హిందువుల మనోభావాలను దెబ్బతీసేంతగా అంటే ఆశ్చర్యం కలుగుతోంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వారం రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతోంది. జాతర చివరి మజిలీకి చేరింది.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంత తిరుపతిలో కొలువైన తాతయ్యగుంట గంగమ్మను భక్తులు ఎంతో ఇష్టంగా కొలుస్తారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని సొంత చెల్లిగా గంగమ్మ భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు. అందరూ తల్లిగా కొలిచే గంగమ్మ ప్రాశస్త్యాన్ని తక్కువ చేసేలా పచ్చ పత్రిక కథనం రాయడంపై భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ, అలాగే అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిపై వ్యక్తిగత ద్వేషం వుంటే, మరో రకంగా చూసుకోవాలే తప్ప, గంగమ్మ తల్లిని పావుగా వాడుకోవడం ముమ్మాటికీ హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు ఆ తల్లిని తక్కువ చేసి చూపాలనుకోవడం అత్యంత దుర్మార్గమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ప్రాచీన చరిత్ర తెలిసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటింపజేశారు.
దీంతో తాతయ్యగుంట గంగమ్మ తల్లి వైభవాన్ని మరింత పెంచినట్టైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతరకు భక్తులు పోటెత్తారు. మరీ ముఖ్యంగా రూ.16 కోట్లతో ఆలయాన్ని అద్భుతంగా పునఃనిర్మిస్తున్నారు. బహుశా టీడీపీ హయాంలో చేయలేనిదాన్ని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చేస్తోందని ఎల్లో పత్రికకు కన్ను కుట్టినట్టుంది. దీంతో జాతర ముగింపు రోజు తిరుపతి టాబ్లాయిడ్లో గంగమ్మ ఆలయంపై విషం చిమ్మడం భక్తుల్ని ఆగ్రహానికి గురి చేస్తోంది.
"దేశంలోనే గంగమ్మే తొలి గ్రామ దేవత. జాతరలు ప్రారంభమైంది ఇక్కడే. 1400 సంవత్సరాలకు పూర్వమే , తిరుపతి ఏర్పడక ముందే కొత్తూరు శివార్లలో గ్రామ రక్షణ కోసం వేంకటేశ్వరస్వామి ఆదేశాలతో గంగమ్మ గుడిని ఏర్పరిచినట్టు చరిత్ర చెబుతోంది. 900 ఏళ్ల క్రితం అనంతాళ్వారు స్వామి గంగమ్మ గుడిని పునఃప్రతిష్టించారు. ఈయన గురువైన తిరుమల నంబి వేంకటేశ్వర స్వామిని తాతా తాతా అని పిలిచేవాడు. ఆ తాత పేరున గంగమ్మ గుడి కోసం కోనేరు తవ్వించాడు. అందువల్లే ఈమె తాతయ్యగుంట గంగమ్మ దేవత అయ్యింది. 400 ఏళ్ల క్రితం భక్తులు ముందుగా గంగమ్మను సందర్శించుకున్న తర్వాతే తిరుమలకు వెళ్లేవారు" అని భూమన కరుణాకరరెడ్డి కొంత కాలంగా గ్రామదేవత గురించి విస్తృతంగా ప్రచారం చేయడాన్ని ఎల్లో పత్రిక జీర్ణించుకోలేకపోయింది.
సాహిత్యం, సంస్కృతి, భాష పట్ల అవగాహన, ప్రేమ గల నాయకుడిగా భూమన మాటలకు విలువ వుంటుందని చెబుతూనే, ఆయన మాటలకు, వాస్తవాలకు పొంతనలేదని రాయడం వారికే చెల్లింది. తిరుపతి ఎమ్మెల్యే తన పార్టీ గురించో, లేక తన గురించో గొప్పలు చెప్పడం లేదనే కనీస స్పృహ ఆ పత్రికకు లేకపోయింది. తిరుపతిలో నివసిస్తున్న, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న హిందువులతో పాటు ఇతర మతస్తులు కూడా గర్వించే విషయాలను ఆయన చెప్పారు.
భూమన చెప్పిన మాటలు ఆయన సొంత కవిత్వం కాదు. ఇటీవల కాలంలో ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా శిథిల తవ్వకాల నుంచి రెండు రాతిస్తంభాలు బయటపడ్డాయి. ఆ రాతి స్తంభాలపై బొమ్మల్ని చూడగానే ఆశ్చర్యానందానికి లోనైన భూమన... వెంటనే ఈ విషయాన్ని కేంద్రపురావస్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర పురావస్తుశాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి బృందం తిరుపతికి వచ్చి రాతి స్తంభాలపై బొమ్మలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి.
పల్లవు రాజుల ఆఖరి వంశస్తుల పాలనలో ఒక స్తంభం నిర్మాణం జరిగినట్టు శ్రీలక్ష్మి బృందం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. మరో స్తంభం వేణువు (సంగీత వాయిద్య పరికరం) రూపంలో ఉండడంతో ఇది చోళ రాజుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నట్టు చెప్పారు. పల్లవులు, ఆ తర్వాత చోళులు, విజయనగర రాజుల కాలంలో ఆలయం నిర్మాణానికి నోచుకుం దని పురావస్తుశాఖ అధికారులు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆలయ చరిత్రను నిగ్గుతేల్చేందుకు ఆర్కియాలిజీ విభాగం పరిశోధన చేస్తోంది. ఆఖరి పల్లవు వంశస్తుల పాలన అంటే ఏడెనిమిది శతాబ్దాల కాలం. దాదాపు 1300 సంవత్సరాలకు పూర్వమే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు ఆధారాలు చెబుతున్నాయి.
ఈ రాతి స్తంభాలపై వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన విష్ణుమూర్తుల బొమ్మలను గుర్తించారు. దీంతో వెంకటేశ్వరస్వామి చెల్లెలు గంగమ్మ అని నిర్ధారణ అయ్యింది. అలాగే ఇది అత్యంత పురాతన ఆలయని తేలిపోయింది. తిరుపతితో పాటు చుట్టుపక్కల నిర్మితమైన గోవిందరాజస్వామి, తిరుచానూరు అమ్మవారి ఆలయాల కంటే తాతయ్యగుంట గంగమ్మ ఆలయం పురాతన మైందని పురావస్తుశాఖ అధికారుల ప్రాథమిక పరిశోధనతో నిర్ధారణ అయ్యింది. పచ్చ పత్రిక విషం చిమ్మినట్టుగా, ఇందులో చరిత్రను పక్కదారి పట్టించడం ఎక్కడుంది?
సీఎం వైఎస్ జగన్, అలాగే అధికార పార్టీ తిరుపతి ఎమ్మెల్యేపై పచ్చ పత్రిక విద్వేషాన్ని చిమ్మడాన్ని అర్థం చేసుకోవచ్చు. చివరికి లోకమంతా అమ్మగా పిలుచుకునే తాతయ్యగుంట గంగమ్మ తల్లిపై కూడా అదే స్థాయిలో విద్వేష రాతలు రాయడం న్యాయమా? ఈ పచ్చ పత్రిక తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ప్రతిష్టను ఎంతగా దిగజార్చిందో మచ్చుకు వారి రాతల్లోని కొన్నింటిని పరిశీలిద్దాం.
"1881 నాటికి తిరుపతిలోని గంగమ్మ గుడి ప్రాంతంలో ఆలయం ఏదీ లేదని, గ్రామానికి తూర్పుగా తోపులో, ఒక చెట్టు కింద అమ్మవారి విగ్రహం వుండేదని బ్రిటీష్ రికార్డులు చెబుతున్నాయి. అలాగే 1780-1836 మధ్య కాలంలో తిరుపతిని సందర్శించిన ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర పుస్తకంలోనూ గంగమ్మను దర్శించుకున్నట్టుగా లేదు. వీరాస్వామి కపిలతీర్థం చేరుకుని, అక్కడి నుంచి తిరుమల వెళ్లినట్టే రాశారు"
"1949లో వీఎన్ శ్రీనివాసరావు రాసిన శ్రీవేంకటేశ్వర -బాలాజీ అనే పుస్తకంలో కూడా ఎక్కడా తిరుపతి గంగమ్మ ఆలయం గురించి ప్రస్తావించలేదు. 1980లో సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి వెలువరించిన శ్రీవేంకటేశ్వర గ్రంథంలో కూడా తిరుపతి ఆలయాల చిట్టాలో గంగమ్మ ఆలయాల ప్రస్తావన లేదు"
ఇంకా దారిన పోయే దానయ్యలను తెరపైకి తెచ్చి, గంగమ్మ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పచ్చ పత్రిక బరితెగించడంపై హిందువులు మండిపడుతున్నారు. నమ్మకమే బలం అని, దాన్ని గౌరవిస్తే చాలని, లేనిపోనివి నిజాలుగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని విష పత్రిక రాసుకొచ్చింది. నిజాల గురించి ఎల్లో పత్రిక రాయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వుంటుంది. అబద్ధాలే ఆలంబనగా, ప్రతి అక్షరం విషం చిమ్మడమే లక్ష్యంగా ... చివరికి గంగమ్మ తల్లిపై కూడా కత్తి కట్టారంటే ఏమనుకోవాలి? తాను కూత కూస్తే తప్ప తెల్లవారదని వెనుకటికి ఓ పుంజుకోడి అన్న చందంగా... తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చరిత్రపై పచ్చి పత్రిక విద్వేష పరిశోధన కథనం వుంది.
ఫలానా వాళ్ల పుస్తకంలో గంగమ్మ ఆలయ ప్రస్తావన లేదు కాబట్టి, అసలు అక్కడ ఆ తల్లి ఆలయమే లేదని బుకాయించడం పచ్చ పత్రిక దిగజారుడుకు పరాకాష్ట. అధికార పార్టీ నేతలపై ఆ పత్రిక అక్కసు చూస్తుంటే, భవిష్యత్లో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిపై కూడా ఇలాంటి తప్పుడు కథనమే రాసినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.