మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుంటుండటం ద్వారా కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్పో కోలుకుంటోంది. బీజేపీ పదిహేనేళ్లుగా ఉండిన మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ లలో, ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేసే రాజస్తాన్ లో కాంగ్రెస్ కు అధికారం అందుతోంది. వీటిల్లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ రాలేదు.
అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ ఓటమిని అంగీకరించాడు. కర్ణాటక తరహాలో చేద్దామని బీజేపీవాళ్లు ప్రతిపాదించినా చౌహాన్ వద్దన్నాడట. పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించి అలిసిపోయాడో ఏమోకానీ.. ఓటమి తర్వాత ప్రశాంతంగా ఉందని ట్వీట్ చేశాడు చౌహాన్.
ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ వైపు చూస్తున్నారు. రాజస్తాన్, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ సీఎల్పీలు ముఖ్యమంత్రి ఎవరనే అంశాన్ని రాహుల్ గాంధీనే తేల్చాలని తీర్మానాలను పంపించారు. ఇక తేల్చాల్సింది రాహుల్ గాంధీనే అని స్పష్టం అవుతోంది.
మరి రాహుల్ ఎంపిక యంగ్ సీఎంల వైపు నిలుస్తుందా లేక వృద్ధనేతల మీదనా అనేది ఆసక్తిదాయకమైన అంశం ఇప్పుడు. రాజస్తాన్ లో సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ లు పోటీ పడుతున్నారు. మధ్యప్రదేశ్ లో కమలనాథ్, జ్యోతిరాధిత్య సింధియాలు పోటీ పడుతున్నారు.
వీరిలో పైలట్, సింధియాలు రాహుల్ గాంధీకి సన్నిహితులు. గెహ్లట్, కమల నాథ్ లు సోనియాకు, గాంధీ కుటుంబానికి విధేయులు. ఈ అంశంలో తేల్చడం, తేల్చుకోవడం రాహుల్ గాంధీకి కూడా అంత సులభం కాదు. అలాగే చత్తీస్ గడ్ లో కూడా ఇద్దరు ప్రముఖ నేతలు సీఎం సీటు కోసం పోటీ పడుతున్నారు. వీరందరినీ రాహుల్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.