పవన్ సారూ.. పలకరేంటి? పునఃదర్శనమెప్పుడు?

ఒకవైపు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రంలో రకరకాల పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి. పోలింగ్ ప్రక్రియ మీద ప్రధాన పార్టీలు రకరకాలుగా స్పందిస్తున్నాయి. వాటిల్లో గెలుపు, ఓటములకు సంబంధించిన లెక్కలను పక్కన పెడితే.. పోలింగ్ ప్రక్రియలో ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తంచేస్తోంది తెలుగుదేశం పార్టీ. కొన్ని అసంబద్ధమైన వాదనలను వినిపిస్తూ తెలుగుదేశం వాళ్లు ఈవీఎంలను తప్పుపడుతూ ఉన్నారు. ఇది వరకూ ఈవీఎంల మీద జరిగిన ఎన్నికల్లోనే నెగ్గినా.. ఈసారి ఈవీఎంలను చంద్రబాబు నాయుడు అనుమానిస్తూ ఉన్నారు.

ఇక బాబు మాటలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవుతూ లాజిక్స్ ను ప్రస్తావిస్తోంది. బాబు మాటలు ఎంత లాజిక్ లెస్ గా ఉన్నాయో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా వివరించారు. ఇక రాష్ట్ర స్థాయిలో పోస్ట్ పోల్ వయోలెన్స్ తీవ్రంగా ఉంది. పలుచోట్ల పోలింగ్ రోజున, పోలింగ్ అనంతరం కూడా హింస చోటు చేసుకుంది. ఇంకా పలుచోట్ల పంటలకు నిప్పుపెట్టడాలు, దాడులు, అల్లర్లు సాగుతూ ఉన్నాయి. ఎన్నికల ఉద్రిక్తత తగ్గడంలేదు.

ఇక ఫలితాల విషయంలోనూ చర్చ జరుగుతూ ఉంది. ప్రజలు, పార్టీల వాళ్లు రకరకాల మాటలు అనుకుంటున్నారు. ఇక తెలుగుదేశం వాళ్లు అయితే.. 'అసలు ఫస్ట్ ఫేజ్ లో ఏపీ ఎన్నికలు పెట్టడమే పెద్ద కుట్ర' అంటున్నారు. వీరికి ఒక హద్దంటూ లేకుండా పోతోందలా!

మరి ఇంత జరుగుతుంటే.. పవన్ సారు మాత్రం పలకడంలేదు! ఇప్పుడు పవన్ కల్యాణ్ వచ్చి గెలుపు గురించినో, ఓటమి గురించినో మాట్లాడమని అనడంలేదు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత తెలుగుదేశం అధినేత ఈవీఎంల మీద అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి.. ఒక పార్టీ అధినేతగా అయినా పవన్ కల్యాణ్ ఈ విషయం మీద స్పందించాలి. తన అభిప్రాయం ఏమిటో అయినా చెప్పాలి.

ప్రజాస్వామ్యంలో దేని మీద అయినా చర్చ మంచిదే. చంద్రబాబు అనుమానాలు చంద్రబాబు వ్యక్తంచేస్తే వైఎస్సార్సీపీ వాళ్లు అందులోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎటొచ్చీ జనసేన కథే ఈ సీన్లో డైలాగులు లేవ్.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి పవన్ సారుకు డైలాగులు ఏమీలేకుండా పోయినట్టుగా ఉన్నాయి. ఇంతకీ ఎప్పుడు స్పందిస్తారో మరి!

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా? 

Show comments