జూన్ 3 వరకూ దేశంలో ‘లాక్డౌన్’ కొనసాగడమే మంచిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడిన విషయం విదితమే. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం. మరోపక్క, తమ రాష్ట్రంలో తక్కువ కేసులే నమోదైనా ఒరిస్సా రాష్ట్రం ఏప్రిల్ 30వ తేదీ వరకూ లాక్డౌన్ని పొడిగించింది. దేశంలో నెలకొన్న ‘కరోనా భయం’కి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ రోజు కేసుల తీవ్రత కాస్త తగ్గినట్లే కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 18 కేసులు మాత్రమే ఈ రోజు నమోదయ్యాయి. మరోపక్క, దేశ ఆర్థిక రాజధాని ముంబై, కరోనా దెబ్బకు విలవిల్లాడిపోతోంది. ఈ రోజు ఒక్కరోజే 200కి పైగా కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదు కావడం గమనార్హం. వీటిల్లో మెజార్టీ వాటా ముంబైదే.
మహారాష్ట్ర తర్వాత అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రం తమిళనాడు. ఢిల్లీ తర్వాతి స్థానంలో నిలిచింది. మరోపక్క పలు రాష్ట్రాల్లో ఈ రోజు దాదాపుగా 50 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ తీవ్రత చూస్తోంటే, ఇప్పట్లో కరోనా వైరస్ సద్దుమణిగేలా కన్పించడంలేదు. ఇదంతా నిజాముద్దీన్ మర్కజ్ పుణ్యమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
ఇదిలా వుంటే, లాక్డౌన్ పొడిగింపుపై కేంద్రం ఖచ్చితమైన అవగాహనతో వుంది. అధికారికంగా రేపో మాపో ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారు. కరోనా వైరస్కి వ్యాక్సిన్ లేదు గనుక, ఖచ్చితమైన మందు కూడా లేదు గనుక.. లాక్డౌన్ తప్ప ఇంకో మార్గం లేదు. కానీ, ఎన్నాళ్ళు ఈ లాక్డౌన్ ఇలా కొనసాగించగలం.? అన్నదే అసలు ప్రశ్న. దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా మారుతోంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా నానాటికీ దిగజారిపోతోంది.
అయినాసరే, ప్రభుత్వాలు లాక్డౌన్ కొనసాగింపు వైపే మొగ్గు చూపుతున్నాయంటే.. కరోనా సృష్టిస్తున్న భయాందోళనలు అలాంటివి మరి. ఇదిలా వుంటే, ఏప్రిల్ 22 నాటికి తెలంగాణలో కరోనా పూర్తిగా కంట్రోల్లోకి వస్తుందనే ఆశాభావం తెలంగాణ ప్రభుత్వం నుంచి వ్యక్తమవుతోంది.