వాట్సాప్ కొత్త అప్ డేట్.. ఇకపై ఆ బాధ తప్పినట్టే

వాట్సాప్ తో ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనకు సంబంధం లేకుండానే గ్రుపుల్లో చేరిపోతుంటాం. అందులోంచి బయటకొచ్చే ఆప్షన్ మనకు ఉన్నప్పటికీ.. ఒక్కసారి గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత బయటకొస్తే జనాలు ఫీలవుతారేమో అనే మొహమాటంలో గ్రూపుల్లో కొనసాగేవాళ్లు చాలామంది. ఇకపై ఇలాంటి బాధలుండవు. గ్రూప్ లో యాడ్ చేయాలంటే, మీ అనుమతి తప్పనిసరి. ఈ మేరకు సరికొత్త అప్ డేట్ తీసుకొచ్చింది వాట్సాప్.

ఇకపై మన ప్రమేయం లేకుండా ఎవ్వరూ మనల్ని వాట్సాప్ లో యాడ్ చేయలేరు. గ్రూప్ క్రియేట్ అయ్యే ముందు మనకు ఓ మెసేజ్ వస్తుంది. ఆ గ్రూప్ లో చేరాలా వద్దా (అవును-కాదు) అనే ఆప్షన్ మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈలోగా మనం ఆ గ్రూప్ లో చేరాలనుకుంటే 'ఎస్' కొట్టాలి. వద్దనుకుంటే 'నో' కొడితే సరిపోతుంది. స్పందించకుండా ఉంటే 3 రోజుల తర్వాత దానంతట అదే డిసేబుల్ అయిపోతుంది. అంతేకాదు, మన నంబర్ ను ఏ గ్రూప్ లో యాడ్ చేయకుండా ఉండేలా సెట్టింగ్స్ లో ఓ ఆప్షన్ కూడా అందుబాటులోకి వస్తోంది.

ఫేక్ పింగ్స్ ను అరికట్టేందుకు వాట్సాప్ ఇప్పటికే ఓ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఫార్వార్డ్ మెసేజ్ అనే సందేశాన్ని చూపిస్తుంది. ఇకపై దీన్ని మరింత అప్ గ్రేడ్ చేశారిప్పుడు. ఫార్వార్డ్ మెసేజ్ అయినప్పటికీ ఎక్కువగా షేర్ అయితే.. ఫ్రీక్వెన్ట్లీ ఫార్వార్డ్ అనే సందేశాన్ని చూపించనుంది. దీనివల్ల సోషల్ మీడియాలో ఫేక్ మెసేజీల్ని గుర్తించడం మరింత సులభం అవుతుంది.

మరోవైపు ఫింగర్ ప్రింట్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది వాట్సాప్. ఇకపై పాప్-అప్ నోటిఫికేషన్ ద్వారా మెసేజీలకు మనకు సంబంధం లేకుండా వేరే వ్యక్తులు రిప్లయ్ ఇవ్వడం కుదరదు. ఫింగర్ ప్రింట్ ఆధారంగా ఓపెన్ చేసి రిప్లయ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు వాట్సాప్ ను ఫేస్ బుక్ కు మరింత లోతుగా అనుసంధానిస్తూ బిజినెస్ ఆధారిత అప్లికేషన్స్ ను అభివృద్ధి చేస్తున్నారు.

ఇలా చేయడం వల్ల తన వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోవాలని ఫేస్ బుక్ భావిస్తోంది. ప్రస్తుతం భారత్ లో వాట్సాప్ కు 40 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..

Show comments