"నిత్యకల్యాణం" డెంగ్యూ దోమ లాంటోడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలకు వైసీపీ శ్రేణులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాయి. ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు వైసీపీ నేతలంతా పవన్ ను "పవన్ నాయుడు" అంటూ ఏడిపిస్తుంటే.. ఈ సెటైర్లను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారు ఎంపీ విజయసాయిరెడ్డి. పవన్ కల్యాణ్ ను పరోక్షంగా డెంగ్యూ దోమతో పోల్చారు.

"‘నిత్య కళ్యాణం’ గురించి సోషల్ మీడియాలో   ఏమనుకుంటున్నారంటే... సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై ‘దోమ’లకు కష్టకాలమే."

ఇలా ఓ రేంజ్ లో సెటైర్లు  వేశారు విజయ్ సాయి. అక్కడితో ఆగలేదు. జగన్ ప్రవేశపెట్టబోతున్న ఇంగ్లిష్ మీడియంపై పసలేని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు-పవన్ కు జాయింట్ గా మరో కౌంటర్ కూడా తగిలించారు. ఎలక్షన్లలో ఓడించినందుకు ప్రజలపై పవన్-బాబు కక్ష కట్టారని ఎద్దేవా చేశారు.

"దళితులకు రాజకీయలెందుకని బండ బూతులు తిట్టిన చింతమనేనికి, బలహీనవర్గాల బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులెందుకని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, పవన్లకు ఏం తేడా లేదు. వీళ్లకు పేదోళ్లన్నా, నిమ్న వర్గాల వారన్నా చాలా చిన్న చూపు. ఎలక్షన్లలో చిత్తుగా ఓడించినందుకు ఇంకా కసి పెంచుకున్నారు."

ఇసుక దీక్షలో పాల్గొన్న చంద్రబాబు మెడలో ఇసుక పొట్లాలు వేసుకోవడాన్ని ఎద్దేవా చేశారు విజయసాయి. భవిష్యత్తులో కరువు పైన దీక్ష చేస్తే మెడలో ఎముకల హారం వేసుకుంటారా అని ప్రశ్నించారు. ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు ఏం చేస్తున్నారో తనకే తెలియడం లేదని.. ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా బాబు దీక్షకు హాజరుకాలేదని పంచ్ లు వేశారు.