ఓన్లీ టాలీవుడ్: దేవకొండ నుంచి మరో మూవీ

నోటా తర్వాత విజయ్ దేవరకొండ జాగ్రత్తపడ్డాడు. అప్పటికే చర్చల్లో ఉన్న మల్టీస్టారర్ సినిమాను పూర్తిగా పక్కనపెట్టాడు. ఇకపై తెలుగు-తమిళ భాషల్లో సైమల్టేనియస్ గా సినిమాలు చేయాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. తాజాగా తన అప్ కమింగ్ మూవీ డీటెయిల్స్ బయటపెట్టాడు ఈ హీరో.

ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న ఈ హీరో, త్వరలోనే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇది ఇప్పుడేదో ఫ్రెష్ గా కుదిరిన కాంబినేషన్ కాదు. గతంలో విజయ్ దేవరకొండ లాట్ లో ఒప్పుకొని, అడ్వాన్స్ తీసుకున్న కథల్లోనిదే ఇది.

కాకపోతే, ఈ సినిమాను పక్కనపెట్టి సూర్య హీరోగా రాబోతున్న మల్టీస్టారర్ లో నటించాలనుకున్నాడు. కానీ నోటా ఎఫెక్టుతో ఆ ఆలోచనను పక్కనపెట్టి, క్రాంతిమాధవ్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చాడు. అక్టోబర్ 18న ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతారు.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు. వాళ్ల పేర్లు కూడా బయటపెట్టారు. ఫస్ట్ టైం దేవరకొండ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటించబోతోంది. మిగతా ఇద్దరు హీరోయిన్లు ఐశ్యర్య రాజేష్, ఇసాబెల్లెడి.

ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు క్రాంతిమాధవ్. రీసెంట్ గా సునీల్ తో ఉంగరాల రాంబాబు అంటూ ఓ చిన్న కమర్షియల్ ప్రయత్నం చేసి ఫ్లాప్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్లీ తన పాత ఫార్మాట్ లోకి షిఫ్ట్ అయి, విజయ్ దేవరకొండతో ఓ సునిశితమైన ప్రేమకథను తెరకెక్కించబోతున్నాడు.

Show comments