వర్షంలో విహారయాత్రలా.. ఆలోచించుకోవాలి!

పాపికొండల సౌందర్యం గురించి ఇది వరకూ అనేక మంది వివరించారు. గోదావరి అందాలను వర్ణిస్తూ అనేక మంది పాపికొండల మధ్యన గోదావరి నదీ ప్రవాహం కన్నులపండగలా ఉంటుందని వివరించారు. బోలెడన్ని సినిమా షూటింగులు కూడా ఆ ప్రాంతంలో జరిగాయి కూడా. అలాంటి ప్రకృతి రమణీయమైన స్థలాన్ని వర్షాకాలంలో చూడాలని అనుకోవడం, అదే సమయంలో గోదావరి నిండుగా ప్రవహిస్తున్నప్పుడు చూడాలని అనుకున్నారు పాపం. కొన్ని వేల మంది ఇదే సమయంలో ఆ ప్రాంతాన్ని సందర్శించినా.. ఒక బోటు ప్రమాదం కొన్ని కుటుంబాల్లో చీకటిని నింపింది.

కుటుంబీకులందరినీ కోల్పోయి కొంతమంది రోధిస్తున్నారు. భర్త, పిల్లలు చనిపోయి జీవితాన్నే కోల్పోయినంత బాధలో ఉన్న వారు కొందరు. తమ కుటుంబీకుల జాడే దొరకలేదని విషాదంలో మునిగిన వారు ఇంకొందరు. దురదృష్టవశాత్తూ జరిగిన సంఘటన. ఇదే సమయంలో కొన్ని గుణపాఠాలను నేర్పుతోంది. అటు ప్రభుత్వం, ఇటు సామాన్య ప్రజలు కూడా ఇలాంటి ఘటనలతో తమవంతుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.

పర్మిట్లు లేకుండా తిరిగే బోట్లను పూర్తిగా కట్టడి చేయాలని, వాటిని నడిపే వారి లైసెన్సులు ఏ పాటివో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. ఒక సంఘటన జరిగిన తర్వాత అలర్ట్  కావడం, ఆ తర్వాత గాలికి వదలడం మన వ్యవస్థకు మామూలే అయిపోయింది. ఆ పరిస్థితిలో ఎప్పటికి మార్పు వస్తుందో కూడా అంతుబట్టడం లేదు. ఇక ఈ ప్రాంతంలో ఇది వరకూ విహరించిన వారిని అడిగితే.. లైఫ్ జాకెట్లు ధరించడం తప్పనిసరి అని, బోటు వాళ్లు కూడా ఆ విషయంలో ఒత్తిడి తెస్తారని చెప్పారు.

లైఫ్ జాకెట్లు ధరిస్తే ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు చాలా వరకూ ఉంటాయని వారు విరిస్తారు. అయితే దేవీపట్నం బోటు ప్రమాదంలో గల్లంతయిన వారిలో చాలా మంది ఏసీ క్యాబిన్లో కూర్చుని ప్రయాణిస్తున్న వారని తెలుస్తోంది. వారు క్యాబిన్ నుంచినే బయటపడలేక జలసమాధి అయినట్టుగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన అధికారులు చెబుతున్నారు. పూర్తిగా దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన ఇది. వర్షంలో, వరదల్లో విహారయాత్రలు చేయాలనే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. 

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు

Show comments