వంగవీటికి వైసీపీ ఆఫర్ అదే.. వాట్ నెక్ట్స్?

తాము వంగవీటి రాధాకు విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను కేటాయిస్తున్నామని.. ఆ నియోజకవర్గం బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నామని.. ఈ రోజు మరోసారి ప్రకటించాడు వైసీపీ నేత అంబటి రాంబాబు. రెండు రోజులుగా వంగవీటి రాధా విషయంలో హైడ్రామా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబటి స్పందిస్తూ.. విజయవాడ ఈస్ట్‌లో కాపు సామాజికవర్గం జనసంఖ్య ఎక్కువగానే ఉంటుందని, రాధాకు అది అనుకూల నియోజకవర్గం అవుతుందని విశ్లేషించాడు.

వంగవీటి రాధాకు సీటు కేటాయింపు విషయంలో సాక్షిలో వచ్చిన కథనంతో వ్యవహారం రసవత్తరంగా మారింది. రాధాను మచిలీపట్నం బరి నుంచి దించాలని జగన్ భావిస్తున్నట్టుగా ఆయన సొంత పత్రికే చెప్పింది. అందులో కూడా విజయవాడ ఈస్ట్‌ను ప్రస్తావించారు. విజయవాడ సెంట్రల్ మాత్రం మల్లాది విష్ణుకే అని, బ్రహ్మాణ ఓట్ల సంఖ్య గణనీయంగా ఉన్న ఆ నియోజకవర్గంలో విష్ణు సరైన అభ్యర్థి అవుతాడని ఆ పత్రిక పేర్కొంది. అప్పటికే రాధాకు వైసీపీ అధిష్టానం తమ ఉద్దేశాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తోంది.

జగన్ సొంత పత్రికలో ఈ వార్త రావడంతో రాధా ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. ఇక ఈ రోజు కూడా ఇది కొంత కొనసాగింది. రాధా-రంగ అభిమానులు వైసీపీ సభ్యత్వాలకు నిప్పు పెట్టారట. తను మూడు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని రాధా వారి ముందు ప్రకటన చేసినట్టుగా సమాచారం. ముందుగా మచిలీపట్నం ఎంపీ సీటు లేదా విజయవాడ ఈస్ట్ అని చెప్పిన వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు రాధాను ఈస్ట్ సీటు ద్వారా బుజ్జగించాలని చూస్తున్నట్టుగా అర్థమవుతోంది.

2004 ఎన్నికల్లో రాధా ఈ నియోజకవర్గం నుంచినే విజయం సాధించాడు. గత ఎన్నికల్లో మాత్రం ఇక్కడ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారాయన. మరి మరోసారి అక్కడ నుంచి పోటీకి సై అంటాడా? లేక జై జనసేన అంటాడా? అనేది కొన్ని గంటల్లోనే తెలిసిపోయే అవకాశాలున్నాయి.

Show comments