జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో కలిసి మొన్నటివరకు ఓ కమిటీలో సభ్యుడిగా కొనసాగిన ఉండవల్లి అరుణ్ కుమార్, ఇప్పుడు అదే పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదంటున్నారు ఈ మాజీ ఎంపీ.
"పవన్ ఏం చేస్తాడో ఎవడికీ తెలీదు. కాకపోతే ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమా వాళ్లు అనేక రకాల ఆలోచనలు చేస్తారు. అన్నింటినీ కలిపి బేరీజు వేసుకొని వెళ్తారు. ఆయనేం చెస్తాడో మనకు తెలీదు. ప్రస్తుతానికైతే పవన్ కల్యాణ్ అనే మనిషికి సొసైటీలో చెడ్డపేరు లేదు."
పవన్ రాజకీయ ప్రస్థానంపై స్పందించడానికి అసలు జనసేన పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు ఉండవల్లి. పవన్ రాజకీయంగా ఏమీ చేయలేదని, అలాంటి వ్యక్తిపై స్పందన అనవసరం అన్నారు. రీసెంట్ గా జరిగిన ఓ మీటింగ్ లో పవన్ తనను పూర్తిగా డిసప్పాయింట్ చేశాడని విమర్శించారు.
"ఆయన (పవన్) రాజకీయ ప్రస్థానంపై స్పందించడానికి, అసలు రాజకీయంగా రావాలి కదా. ఇప్పటివరకైతే ఏమీ చేయలేదు. రేపోమాపో ఏదో పుస్తకం రాస్తానంటున్నాడాయన. ఆ పుస్తకం వచ్చాక చూడాలి ఏమైనా విషయం ఉంటుందేమో. మొన్న కాకినాడలో మీటింగ్ కు కూడా జనాలైతే వచ్చారు కానీ పవన్ ప్రసంగం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. నేను బాగా నిరాశ చెందాను."
రాజకీయాల్లో సినిమా డైలాగులు పనికిరావన్నారు ఉండవల్లి. పవన్ తన ప్రసంగాల మధ్యలో పాటలు పాడడాన్ని, సినిమా డైలాగులు చెప్పడాన్ని తప్పుపట్టారు. సీరియస్ పాలిటిక్స్ నేర్చుకోవాలని సూచించారు. ప్రసంగాల మధ్యలో పవన్ గేయాలు, పాటలు పాడుతున్నాడు. అదెందుకో నాకు అర్థంకాలేదు.
రాజకీయాల్లోకి సీరియస్ గా రావాలి. ఎన్టీఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక్క సినిమా డైలాగ్ కొట్టలేదు. సరదాగా జనాల్ని ఆనందపరిచేలా ప్రవర్తించలేదు. సీరియస్ రాజకీయాలు మాట్లాడాడు. పవన్ అలా చేయట్లేదు ఎందుకో మరి."
ఈ కాలంలో సినిమావాళ్లు ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా డైలాగులు కొడితే సరిపోదంటున్నారు ఉండవల్లి. అయినా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చే రోజులు పోయాయని, ఎవరి పనివాళ్లు చేసుకుంటే బెటరని పరోక్షంగా అభిప్రాయపడ్డారు.