రేవంత్ కు ఇద్దరు ఎంపీల ఝలక్!

తెరాస నుంచి ఇద్దరు ఎంపీలు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రకటించిన ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డికి ఇద్దరు ఎంపీలు ఝలక్ ఇచ్చారు. తాము తెరాసను వీడే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. రేవంత్ ఇద్దరు ఎంపీలు.. అనగానే రెండు పేర్లను తెరపైకి తెచ్చింది మీడియా.

అవే.. కొండా విశ్వేశ్వరరెడ్డి, సీతారాం నాయక్.. వీరిద్దరూ తెరాసను వీడనున్నారని ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం రేవంత్ చేసిన వ్యాఖ్యలే. వీరిద్దరూ పార్టీలో అసహనంతో ఉన్నారని.. అందుకే కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. పై పెచ్చూ కేసీఆర్ కు దమ్ముంటే వీళ్లను ఆపాలని కూడా రేవంత్ సవాల్ విసిరాడు.

దీంతో వ్యవహారం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో అటు విశ్వేశ్వర రెడ్డి, ఇటు సీతారాం నాయక్ లు స్పందించారు. తాము తెరాసను వీడే ప్రసక్తిలేదని వీళ్లు వివరణ ఇచ్చుకున్నారు. తమ విషయంలో రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఈ ఇద్దరు నేతలూ ప్రకటించారు.

తనపై దుష్ప్రచారం సాగుతోందని విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించగా, రేవంత్ కు దమ్మూ ధైర్యం ఉంటే ఆ ఎంపీల పేర్లను చెప్పాలని సీతారాం నాయక్ సవాల్ విసిరాడు. రేవంత్ రెడ్డి కామ్ అయ్యాడిప్పుడు!

Show comments