స్వీట్‌ షాక్‌: నజ్రియా బాటలో రష్మిక

నజ్రియా నజీమ్‌ గుర్తుందా.? పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటించిందీ బ్యూటీ. నయనతార, ఆర్య, జై, సత్యరాజ్‌ తదితరులు నటించిన 'రాజా రాణి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలైపోయింది. ఈ సినిమా తెలుగులోకి డబ్‌ అయ్యాకనే, అమ్మడి మీద టాలీవుడ్‌ ఫోకస్‌ పెట్టింది.

ఏకంగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలో ఆమెతో నటింపజేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే, చిత్రంగా ఆమె అవకాశాన్ని వదులుకుంది. అందరికీ పెద్ద షాక్‌ ఇచ్చి, పెళ్ళి పీటలెక్కేసింది నజ్రియా నజీమ్‌. బోల్డంత కెరీర్‌ని వదిలేసుకుని నజ్రియా, పెళ్ళి పీటలెక్కడం అప్పట్లో సినీ జనం జీర్ణించుకోలేకపోయారు.

ఇక, తాజాగా అలాంటి స్వీట్‌ షాక్‌ మరో బ్యూటీ ఇచ్చేసింది. ఈసారి పెళ్ళి వార్తతో షాక్‌ ఇచ్చిన ఆ బ్యూటీ ఎవరో కాదు, రష్మిక మండన్న. అల్లు అర్జున్‌ సరసన ఓ సినిమాలో నటించబోతోందట.. ప్రభాస్‌ 'సాహో' సినిమా కోసం రష్మిక మండన్నను సంప్రదిస్తున్నారట.. ఇలా రష్మిక గురించి టాలీవుడ్‌లో విన్పించిన గాసిప్స్‌ అన్నీ ఇన్నీ కావు.

కన్నడ సినిమా 'కిరిక్‌ పార్టీ'తో రష్మిక బాగా పాపులర్‌ అయ్యింది. ఒకే ఒక్క సినిమా ఆమెకు స్టార్‌డమ్‌ తెచ్చేసింది. అంతే, ఇప్పుడామె 'కో-స్టార్‌' రక్షిత్‌ శెట్టిని పెళ్ళాడబోతోంది. అక్కడ నజ్రియా కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్ళాడింది. ఇక్కడ, రష్మిక కూడా అదే బాటలో నడుస్తోంది. ఇద్దరూ తెలుగు సినిమా గాసిప్స్‌ కాలమ్స్‌లో బాగా పాపులర్‌ అయినోళ్ళే.

Show comments