మరో నాలుగు సీట్లకు టీడీపీ అభ్యర్థులు ఖరారు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల అంశం గురించి కసరత్తును కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఉన్నారు చంద్రబాబు. ప్రత్యేకించి టీడీపీ సిట్టింగులు లేనిచోట్ల చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో నాలుగు నియోజకవర్గాలు చేరాయి.

చిత్తూరు, కడపజిల్లాల సీట్లపై చంద్రబాబు కసరత్తు సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో రాజంపేట, పుంగనూరు, పీలేరు, రాయచోటి సీట్లకు టీడీపీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. గత కొంతకాలంగా పుంగనూరు నుంచి టీడీపీ ఇన్ చార్జిగా ఉన్న అనుషా రెడ్డికి అక్కడ సీటు ఖరారు అయ్యింది.

ఆమె మంత్రి అమర్ నాథ్ రెడ్డికి మరదలు వరస. వాస్తవానికి పుంగనూరు  సీటును అమర్ నాథ్ రెడ్డి ఆశించారు. పలమనేరు నుంచి తిరిగి పోటీ చేయడానికి ఆయనకు ఆసక్తిలేదట. అయితే ఈ ఫిరాయింపు మంత్రికి బాబు ఛాన్స్ ఇవ్వడంలేదు.

అమర్ నాథ్ రెడ్డికి పలమనేరును మిగులుస్తూ.. పుంగనూరు నుంచి అనూషా రెడ్డికి అవకాశం ఇచ్చారట. ఇక్కడ వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని ఆమె ఢీకొట్టనుంది. ఇక రాయచోటి నుంచి రమేష్ రెడ్డికి అభ్యర్థిత్వం ఖరారు అయ్యింది.

రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడిన నేపథ్యంలో అక్కడ నుంచి బత్యాల చెంగల్రాయుడుకు అవకాశాన్ని ఇచ్చారు. ఇక ఈ రోజుకు అభ్యర్థి ఖరారు అయిన మరో నియోజకవర్గం పీలేరు.

అక్కడ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి టీడీపీ టికెట్ ఖరారు అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ చింతల రామచంద్రారెడ్డి పోటీచేయనున్నారు.

రాయలసీమ రైతుల పుండుపై కారం