సైరా కోసం 50 కోట్ల కీలకయుద్ధం

మెగాస్టార్ చిరంజీవి-డైరక్టర్ సురేందర్ రెడ్డిల కాంబినేషన్లో తయారవుతున్న ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా షూట్ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఈ రోజు నుంచి ఓ కీలక యుద్ద సన్నివేశ చిత్రీకరణ ప్రారంభమైందట. సుమారు ఇరవై రోజులు వుంటుందీ చిత్రీకరణ.

విషయం ఏమిటంటే, ఈ యుద్ద సన్నివేశం సినిమాలోనే కీలకమైనది కావడం. ఈ ఒక్క యుద్ద సన్నివేశ చిత్రీకరణకే టోటల్ గా యాభై కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. వందలాది గుర్రాలు, వివిధ దేశాలకు చెందిన జూనియర్ ఆర్టిస్టులు వేలాది మంది షూట్లో పాల్గొంటారట. సిజిలో ఈ సంఖ్య అంతకు పదింతలుగా కనిపిస్తుందట.

జార్జియాలో షూటింగ్ ఖర్చులు కాస్త తక్కువ వుంటాయి.పైగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు బాగుంటాయి. పైగా బ్రిటిష్ కాలం నాటి కథ కాబట్టి, విదేశీ జూనియర్ ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో కావాలి. అందుకే అక్కడ లొకేషన్ గా ఎంచుకున్నారు.

ఈ ఎపిసోడ్ ఇంకో స్పెషాలిటీ ఏమిటంటే,  టోటల్ సినిమా లో నటిస్తున్న కీలక నటీనటులు అందరూ పాల్గొనడం. చిరు, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప ఇలా టాప్ స్టార్ కాస్ట్ అంతా వుంటారట. ఈ కీలక యుద్ద సన్నివేశం పూర్తయితే సినిమాలో మేజర్ గ్రాఫిక్ రిలేటెడ్ షూట్ పూర్తయిపోతుందట.

వచ్చే ఏడాది పోస్ట్ సమ్మర్ విడుదల టార్గెట్ గా రెడీ అవుతోంది సైరా.

Show comments