విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్, నాగార్జున మేనకోడలు సుప్రియను పెళ్ళాడనున్నాడంటూ టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తోన్న విషయం విదితమే. అడివి శేష్ హీరోగా రూపొందిన 'గూఢచారి' సినిమా కోసం చాలాకాలం తర్వాత సుప్రియ మేకప్ వేసుకున్న విషయం విదితమే. ఆ సినిమా ప్రారంభమయినప్పటినుంచీ అడివి శేష్ - సుప్రియ మధ్య ఎఫైర్ అంటూ గాసిప్స్ షురూ అయ్యాయి.
కాగా, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్లు పెడ్తున్నాడు అడివి శేష్. షాకింగ్ న్యూస్ చెబుతానంటున్నాడు. అదిగో ఇదిగో.. అంటూ శేష్ సోషల్ మీడియాలో ట్వీట్ల ద్వారా పెంచేస్తున్న హీట్ కారణంగా సుప్రియతో పెళ్ళి.. అంటూ తెరపైకొస్తున్న పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే, అదంతా ఉత్తదేనని తాపీగా అడివి శేష్ క్లారిటీ ఇచ్చేశాడు. 'ఫేక్ న్యూస్.. బాధ్యతా రాహిత్యం..' అంటూ తాజాగా విరుచుకుపడ్డాడు అడివి శేష్ - సుప్రియతో పెళ్ళి వార్తలపై.
తన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలేమన్నా వుంటే, ప్రస్తుతానికి సినిమాలు మాత్రమేననీ నటుడిగా, రచయితగా తాను చాలా హ్యాపీగా వున్నాననీ.. అంతకు మించి వేరే అంశాలకు ప్రస్తుతానికైతే తాను చోటివ్వదలచుకోలేదనీ అడివి శేష్ సోషల్ మీడియాలో లేటెస్ట్గా స్పందించాడు. అడివి శేష్ లేటెస్ట్ ట్వీట్తో సుప్రియతో శేష్ పెళ్ళి.. అంటూ వస్తున్న గాసిప్స్కి దాదాపు ఫుల్స్టాప్ పడ్డట్టేనేమో.!
కొసమెరుపేంటంటే నిన్న నాగ్ - వైఎస్ జగన్ భేటీ నేపథ్యంలోనూ 'శేష్ - సుప్రియల పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి' అంటూ కొన్ని గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం.