పొలిటికల్ క్రికెటర్..తిరిగి సొంత గూటికి చేరతారా?

భారతీయ జనతా పార్టీలో తనకు అవమానాలు జరిగాయంటూ ఆ పార్టీని వీడారు భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ. తనకు అమృత్ సర్ నుంచి ఒకసారి ఎంపీ టికెట్ ఇవ్వనందుకు అలిగారు సిద్ధూ. ఆ తర్వాత ఆయనకు బీజేపీ బాగానే ప్రాధాన్యతను ఇచ్చినట్టే కనిపించింది. అయితే ఎందుకో అలిగారు. చివరకు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

కాంగ్రెస్ లో చేరిన తర్వాత సిద్ధూ తీరు పూర్తిగా మారిపోయింది. సెక్యూలరిస్టులా వ్యవహరిస్తూ వచ్చారు. పాకిస్తాన్ కు వెళ్లారు. అక్కడి ఆర్మీ చీఫ్ తో ఆలింగనం చేసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవం.. వంటివన్నీ సిద్ధూను వివాదాస్పదుడిని చేశాయి. అయితే వాటిని ఈ సర్ధార్జీ లెక్క చేయలేదు.

అయినా సిద్దూకు కాంగ్రెస్ లో ఉక్కపోత తప్పలేదు. ప్రత్యేకించి కెప్టెన్  అంటూ గౌరవిస్తూ వచ్చినా సిద్ధూను దూరం పెడుతూ వచ్చారు పంజాబ్ ముఖ్యమంత్రి  అమరీందర్ సింగ్. ఆఖరికి సిద్ధూ ఇప్పుడు  కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడినట్టుగా  ఉంది. 

సిద్ధూ భార్య కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.  గతంలో సిద్దూ బీజేపీని  వీడినప్పుడు కూడా ముందుగా ఆయన భార్య అక్కడ నుంచి రాజీనామా చేశారు. ఆ తర్వాత సిద్ధూ బయటకు  రావడమేదో జరిగింది. ఇప్పుడు  కూడా సిద్ధూ భార్య ముందుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక నెక్ట్స్ సిద్ధూనే అనే  అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ ను వీడి సిద్ధూ తిరిగి సొంతగూడు బీజేపీలోకి చేరతారా? ఇన్ని రోజులూ సిద్ధూ పై తీవ్రంగా స్పందించిన బీజేపీ ఆయనను చేర్చుకుంటుందా!

Show comments