షా మాట కరక్టే..:: అడకత్తెరలో 'పులి'!

కమలదళంతో వారు బంధం తెంచుకున్నారు. కనుక.. వారి మీద బురద చల్లదలచుకున్నారు. వారు మోసం చేశారంటూ మహారాష్ట్ర ప్రజలకు చాటిచెప్పదలచుకున్నారు. రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం అని చెప్పి మాటతప్పారని అన్నారు.

కాంగ్రెస్ ఎన్సీపీల మద్దతు పొందలేకపోగా.. తిరిగి భాజపా మీదనే నెట్టాలని చూశారు. కానీ తాజాగా అమిత్ షా కౌంటర్ ఇవ్వడంతో మహారాష్ట్రలో  శివసేన పరిస్థితితో అడకత్తెరలో పడ్డట్టుగా అయింది.

భాజపా తమను మోసం చేసిందని చెప్పడంతో పాటూ.. గవర్నరు కూడా వివక్షతో ప్రవర్తించడాని ప్రజల ఎదుట ఎస్టాబ్లిష్ చేయడం లక్ష్యంగా శివసేన ఒక కొత్త ఎత్తుగడ వేసింది. భాజపాకు మాత్రం బల నిరూపణకు మూడు రోజుల గడువు ఇచ్చి తమ పార్టీకి మాత్రం ఒకటే రోజు గడువు ఇచ్చారంటూ సుప్రీం గడప తొక్కింది. ఆ వెంటనే వారికి ఏం అనిపించిందో ఏమో.. తమ వాదనే లోపభూయిష్టంగా ఉన్నదని గ్రహించారో ఏమో గానీ.. ఆ పిటిషన్ పై వెనక్కు తగ్గారు.

ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్న మాటలను గమనిస్తే మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితికి పూర్తి కారణం శివసేనే అనే సంగతి అర్థమవుతోంది.

‘‘బలం నిరూపించుకోవడానికి ఏ పార్టీకి అయినా ఇప్పుడు ఆరునెలల సమయం ఉంది. విపక్షాలు కోల్పోయింది ఏమీ లేదు. రాష్ట్రపతి పాలన నష్టపోయింది మా పార్టీనే. ఫడ్నవీస్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే కూలిపోయింది. మాకు తప్ప మరెవ్వరికీ నష్టం జరగలేదు...’’ అని ఆయన పేర్కొన్నారు.

ఆ కోణంలో ఆలోచించినప్పుడు షా మాటలు కరక్టే. నాలుగ్గోడల మధ్య రెండున్నరేళ్ల సీఎం పోస్టు  ఇస్తామని భాజపా చెప్పిందో లేదో ఎవరికీ తెలియదు. కానీ.. బహిరంగ వేదికల మీద ఫడ్నవీస్ మళ్లీ సీఎం అని మోడీ, షాలు ప్రకటించినది అందరికీ తెలుసు. అలాగే శివసేన తమకు గవర్నర్ మూడు రోజుల గడువు ఇవ్వలేదని నిందలు వేయడం సరికాదు.

ఇప్పుడు అసెంబ్టీ రద్దు కాలేదు. కేవలం రాష్ట్రపతి పాలన ఉన్నదంతే. శివసేనకు చేతనైతే.. ఆరునెలల వ్యవధిలోగా కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు కూడగట్టుకుని.. గవర్నరును సంప్రదించి.. ఆదిత్య ఠాక్రేను గద్దె ఎక్కించవచ్చు. అలా చేయలేకపోతే.. వారి చేతగానితనం బట్టబయలైపోతుంది.

Show comments