భారతీయ జనతా పార్టీకి పునాదులు వేసిన వారిలో ఆయనా ఒకరు. బీజేపీ తరఫున అత్యధిక సార్లు లోక్ సభకు, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన వారిలోనూ ఆయన ఒకరు. 1980 నుంచి 2014 వరకూ దేశ రాజకీయాల్లో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూనే వచ్చింది. అలాంటి వారి ప్రస్థానాన్ని గమనిస్తే.. దేశంలో తనే సీనియర్ అంటూ చెప్పుకునే చంద్రబాబు మాట విని పక్కున నవ్వాల్సి వస్తుంది. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ అనదగ్గ, బీజేపీ వంటి పార్టీకి పునాదులు వేసిన వారిలో ఒకరు, కేంద్రంలో వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించిన నేతైన జశ్వంత్ సింగ్ ఇక లేరు.
82యేళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. మాజీ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి, దేశ రక్షణ శాఖా మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి. వాజ్ పేయి కేబినెట్లో ఈ కీలక శాఖల విధులు నిర్వర్తించారు జశ్వంత్ సింగ్.
2004 నుంచి 2009 వరకూ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు ఆయన. ఐదు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మరో నాలుగు సార్లు లోక్ సభకు నెగ్గారు. అలా బీజేపీకి పునాదులు వేయడంలో భాగస్వామి అయిన ఆయనను అదే పార్టీ నుంచి బహిష్కరించడం విశేషం. ఆర్మీ మాజీ అధికారి అయిన సింగ్ ను ఆరేళ్ల కిందట బీజేపీ నుంచి సస్పెండ్ చేసి అవమానించారు.
2014 ఎన్నికల్లో ఆయనను బీజేపీ అభ్యర్థి చేత ఓడించారు కమలనాథులు. సింగ్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే భారత విమానం హైజాక్ అయ్యింది, ఉగ్రవాది అజర్ ను అప్ఘన్ కు తీసుకెళ్లి వదిలి వచ్చిన కేంద్రమంత్రిగా ఆయన విమర్శలను ఎదుర్కొనాల్సి వచ్చింది.