'భయపడేవాడే బేరానికొస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా...'

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ’సరిలేరు నీకెవ్వరు’.

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. నవంబర్‌ 23 యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి పుట్టినరోజు. ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ నవంబర్‌ 22న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ను విడుదల చేశారు.

మిలటరీ బ్యాక్‌డ్రాప్‌తో మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ ప్రారంభమవుతుంది. ‘మీరెవరో మాకు తెలీదు.. మీకు, మాకు ఏ రక్తసంబంధం లేదు. కానీ, మీకోసం పిల్లల కోసం పగలు, రాత్రి, ఎండా, వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ సైనికుల కర్తవ్యం గురించి చెప్పే మాటలు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి.

ఆ తర్వాత కొంతమంది రౌడీలను ఉద్దేశించి ‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాల్రా. మిమ్మల్నెలా చంపుకుంటాన్రా. మీకోసం ప్రాణాలిస్తున్నాంరా అక్కడ. మీరేమో కత్తులు, గొడ్డళ్లేసుకొని ఆడాళ్ళ మీద.. బాధ్యత ఉండక్కర్లా.. అంటూ చెప్పే డైలాగ్‌ కొత్తగా అనిపిస్తుంది.

ఆ తర్వాత ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌లో ‘భయపడే వాడే బేరానికొస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా..’ అంటూ లౌడ్‌గా చెప్పే డైలాగ్‌ మహేష్‌ క్యారెక్టర్‌లోని ఎమోషన్‌ని తెలియజేస్తుంది.

లేడీ అమితాబ్‌ విజయశాంతి హీరో క్యారెక్టర్‌ గురించి చెప్తూ ‘గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్‌' అంటూ హీరో ఔనత్యాన్ని తెలియజేస్తుంది.

టీజర్‌ ఎండింగ్‌లో ఇరిటేషన్‌లో ఉన్న ప్రకాష్‌రాజ్‌ ‘ప్రతి స్రంకాంతికి అల్లుళ్లొస్తారు... ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు’ అంటూ చెప్పే డైలాగ్‌ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది.

మొత్తానికి ఈ టీజర్‌లో అన్నిరకాల ఎలిమెంట్స్‌ ఉండేలా ఎంతో కేర్‌ తీసుకున్నారనేది అర్థమవుతుంది.

Show comments