డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారట!

చూడబోతుంటే.. ఎన్సీపీతో శివసేన ఒప్పందం కుదిరినట్టుగా కనిపించడం లేదు. తమకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతును ఇవ్వబోతున్నట్టుగా, మహారాష్ట్రలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా కలరింగ్ ఇచ్చారు శివసేన వాళ్లు. అయితే వారు ప్రకటించుకున్నట్టుగా 170 మంది ఎమ్మెల్యేల బలం వారికి ఎలా వచ్చిందో తెలియదంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యతో శివసేన గాలి పోయింది. 

బీజేపీతో బంధం తెంచుకున్న సేనకు పవార్ పవర్ పంచ్ ఇచ్చినట్టుగా అయ్యింది. ఇలాంటి క్రమంలో మహాలో మళ్లీ రాజకీయ ప్రతిష్టంభన నెలకొన్నట్టే అయ్యింది. ఈ అంశంపై ఇప్పుడు శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్ కూడా స్పందించారు. పవార్ ఇచ్చిన పంచ్ తో ఆయనకు కూడా గట్టిగానే ఝలక్ తగిలినట్టుగా ఉంది. అందుకే 'పవార్ ఏం చెప్పారో అర్థం చేసుకోవాలంటే  వంద జన్మలెత్తాలి..' అని రౌత్ వ్యాఖ్యానించారు.

పవార్ వ్యాఖ్యలపై ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాకే రౌత్ ఇలా మాట్లాడినట్టుగా ఉన్నారని స్పష్టం అవుతోంది. అయితే రౌత్  చెబుతున్న మరో మాట ఏమిటంటే, ఇంకా తమ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు మిగిలే ఉన్నాయని. 

కాంగ్రెస్, ఎన్సీపీలు తమకే మద్దతును ఇస్తాయని, డిసెంబర్ కళ్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ రౌత్  ప్రకటించారు. మొత్తానికి రాష్ట్రపతి పాలన నడుస్తూ ఉండటంతో.. పార్టీల బేరసారాలకు కావాల్సినంత అవకాశం దక్కినట్టుగా ఉంది!

Show comments