మళ్లీ.. పరారీలో రవి ప్రకాష్!

టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి సమాచారం అందుతూ ఉంది. రవి ప్రకాష్ విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది. రవి ప్రకాష్ ఎక్కడికి వెళ్లాడనే అంశంపై ఆయన ఇంట్లో వాళ్లను ఆరా తీయగా వారు సరైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.

దీంతో రవి ప్రకాష్ పరారీలో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారని సమాచారం. తను పరారీలో లేనట్టుగా.. తనను ఎవరూ టీవీ నైన్ సీఈవో పదవి నుంచి తప్పించలేరని, తనను ఎవరూ అరెస్టు చేయలేరని రవి ప్రకాష్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

టీవీ నైన్ వివాదం రేగిన తర్వాత అతడు ఆ చానల్ తెర మీదే కనపడి ఈ మాటలు చెప్పాడు. కట్ చేస్తే.. ఆ తర్వాత కొన్ని గంటలకే రవి ప్రకాష్ ను టీవీ నైన్ సీఈవో పదవి నుంచి తొలగిస్తున్నట్టుగా యాజమాన్యం ప్రకటించింది. అతడి పై తాము పోలీసులకు చేసిన ఫిర్యాదులను కొత్త ఓనర్లు ధ్రువీకరించారు.

ఆ తర్వాత రవి ప్రకాష్ మీడియా ముందుకు రాలేదు. పోలీసుల విచారణ నుంచి మినహాయింపును కోరుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అతడికి ఎవరూ మినహాయింపును ఇవ్వలేదు. విచారణ చేపట్టిన పోలీసులు డైరెక్టుగా రవి ప్రకాష్ ఇంటకే వెళ్లగా అతడు అందుబాటులో లేడని తేలింది.

రవి ప్రకాష్ ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదని ఆయన ఇంట్లో వాళ్లు చెప్పారట. దీంతో.. పరారీలో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించుకుంటున్నారు.  

Show comments