రెడ్డిగారు సర్దుకుపోయారు కానీ చేయి దాటిపోయింది!

కర్ణాటకలో సంకీర్ణ సర్కారు ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభానికి తక్షణ కారకుడిగా నిలిచారు రామలింగారెడ్డి. ఈ కాంగ్రెస్ పార్టీ నేత తనకు ఎలాంటి మంత్రి పదవీ దక్కకపోవడంతో అసహనభరితుడు అయ్యారు. గతంలో హోంమంత్రిగా వ్యవహరించిన ఆయనకు ఇప్పుడు ఏ మంత్రి పదవీ లేదు. తనకు బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి పదవి కావాలని ఆయన అడుగుతూ వచ్చారు. అయితే సంకీర్ణ సర్కారులో ఆయనను పట్టించుకోలేదు.
 
ఇటీవలే మంత్రి వర్గ విస్తరణ జరిగినా రామలింగారెడ్డికి పదవి దక్కలేదు. దీంతో ఆయన రాజీనామా అంటూ మొదలుపెట్టారు! ఆయనతో పాటు ఆయన కూతురు, బెంగళూరు నగరంలోని పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాలను సంధించారు. అలా మొదలైంది ఈ సంక్షోభం!

అక్కడ నుంచి అనేక మలుపులు తిరుగుతూ సాగుతూ వచ్చింది. దాదాపు పక్షం రోజుల రచ్చతో ఇప్పుడు కుమారస్వామి సర్కారును కూల్చేసేంత వరకూ వచ్చింది వ్యవహారం. అయితే ఇప్పుడు రామలింగారెడ్డి రాజీపడిపోయారు! మొదటేమో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ ను కలిసి రచ్చ రేపిన ఈయన ఇప్పుడు తన  మద్దతు సంకీర్ణ సర్కారుకే అనే శారు. 

కాంగ్రెస్ ను వీడే ఆలోచన లేదని మొదటి నుంచి చెబుతున్న రామలింగారెడ్డి తను, తన కూతురు రాజీనామా చేయడం లేదని.. తాము సంకీర్ణ సర్కారుకు మద్దతుగా నిలుస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిన సంగతి తెలిసిందే. రచ్చ రేపిన రామలింగారెడ్డి ఇప్పుడు రాజీ పడినా, సర్కారు ఎదుర్కొంటున్న  సంక్షోభాన్ని మాత్రం ఎవ్వరూ నివారించలేకపోతూ ఉండటం గమనార్హం!

Show comments