రాజధానిని ఎవరైనా ఎత్తుకుపోయారా

అమరావతిలో చంద్రబాబు చేపట్టినవన్నీ తాత్కాలిక నిర్మాణాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజలు అధికారమిచ్చిన ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత కట్టడమైనా నిర్మించారా అని ప్రశ్నించారు.

చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఆయన వ్యాఖ్యలు చూస్తే అనుభవమున్న నాయకత్వ లక్షణాలు ఏ ఒక్కటి కనిపించడం లేదని బొత్స ఎద్దేవా చేశారు. ఆత్మస్తుతి, పరనింద తప్పా చంద్రబాబులో పరివర్తన కనిపించడం లేదని చురకలంటించారు.

తమ ప్రభుత్వ హయాంలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్న బొత్స.... ప్రజలందరికీ అందుబాటులో  ఉండే రాజధానిని నిర్మిస్తామని చెప్పుకొచ్చారు.

మరోవైపు, ప్రజలు చిత్తుగా ఓడించిన తర్వాత కూడా చంద్రబాబులో మార్పు రాలేదన్న బొత్స.. తనకు పేరొస్తుందని అమరావతిని సీఎం జగన్‌ ఆపేశాడని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం ఉద్ధరించారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన బొత్స.. కనీసం ఒక్క కట్టడమైనా కట్టారా? మహా అయితే చదరపు అడుగుకు రూ.3 వేలు ఖర్చయ్యే చోట రూ.10 వేలు చూపి అమరావతిలో తాత్కాలిక కట్టడాలు నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ ప్రభుత్వాన్ని అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని మండిపడ్డారు

మంత్రి బొత్స.. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏపీకి పూడ్చలేనంత నష్టం వచ్చిందన్న ఆయన.. బినామీల భూములన్నీ పోతున్నాయని టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్‌ తెగ బాధపడుతున్నారని, మీరు రాజధానిని గొప్పగా కడితే ఎవరైనా ఎత్తుకు పోయారా? అని ప్రశ్నించారు.

Show comments