రఘు-రాముడు-రావణుడు

భీష్ముడిని పడగొట్టడానికి శిఖండి అవసరం పడింది. జగన్ ను జైల్లోకి పంపడానికి ఎవరో ఒకరు పిటిషన్ వేస్తే చాలు మిగతాది మనం చూసుకుందాం అనుకున్నారు. గతంలో చివరకు అదే జరిగింది. 

ఇప్పుడు జగన్ ను గద్దె దింపాలి. జగన్ ను గద్దె దింపితే చాలు, ఇంక ఎవరు అధికారంలోకి వచ్చినా, ఆటాడేసుకుందా అనే ఆలోచనతో వున్నారు తెలుగుదేశం అండ్ కో. అందుకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చే సామాజిక బలగం అన్ని రంగాల్లో రెడీగా వుంది. అలా అని మన పార్టీ, మన వర్గం వాళ్లు ఆ పని చేయకూడదు. 

గతంలో కూడా మనకేం సంబందం లేని జగన్ పార్టీ వాళ్లే కోర్టుకు ఎక్కారు. ఇప్పుడు కూడా అదే పని జరుగుతోంది. వేల కోట్లు బ్యాంకులకు బాకీ. ఆ విషయం ఆయనా మాట్లాడడు. ఆయనకు దన్నుగా వున్న మీడియా ప్రశ్నించదు. పైగా ఆయన కూడా తానేదో చాలా తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. పార్టీ శ్రేయస్సు అంటారు. జగన్ నిజాయతీ నిరూపించుకోవాలంటారు. 

వైకాపానే తిరుపతిలో గెలుస్తుందంటారు. కానీ జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయాలంటారు. కేసు త్వరగా తేలిస్తే జగన్ నిజాయతీగా బయటకు వస్తారని అంటారు. కేసుల త్వరగా తెమల్చమని అడిగితే పోనీ సబబు అనుకోవచ్చు. మరి బెయిల్ క్యాన్సిల్ చేయమని అడగడం అంటే ఏమనుకోవాలి?

మళ్లీ జగన్ రాముడో..రావణుడో తేలాలి అప్పుడే ఆంధ్రకు వస్తాను అంటారు. అంతకు ముందు ఆంధ్ర కు వెళ్లలేకపోతున్నాను. సెక్యూరిటీ కావాలన్నారు. సెక్యూరిటీ ఇచ్చాక, రాముడో రావణుడో తేలాలి అన్నారు. మరింక సెక్యూరిటీ ఎందుకు? దానికి సమాధానం వుండదు. 

నిజానికి నైతికత అనేది ఈ రోజుల్లో దొరకని పదం. అది ఎవరికైనా. అందులో రాజకీయ నాయకులకు అయితే మరీనూ. ఏ పార్టీలోనూ, ఏ నాయకుడిలోనూ అది కనిపించదు. అందుకే రఘురామకృష్ణం రాజు లో కూడా దాన్ని వెదకక్కరలేదు. తాను ఏ పార్టీలో వున్నానో ఆ పార్టీని వీడకుండా, ఆ పార్టీ నాయకుడిని టార్గెట్ చేయడం, జైలుకు పంపాలని అనుకోవడం అంటే ఏమనుకోవాలి. 

ఇష్టంలేని వ్యక్తిపై పోరాడవచ్చు. కానీ సరైన పోరాటం చేయాలి. ఇలా నాలుకను రకరకాలుగా మడత వేసే వ్యవహారం కాదు. ఇక గమనించాల్సిన మరో వ్యవహారం ఏమిటంటే జనం ఇప్పుడు తెలివి మీరిపోయారు. 

జగన్ ను ఎవరు టార్గెట్ చేసినా, లబ్ది పొందే పార్టీ ఏమిటో, లాభపడే సామాజిక వర్గం ఏమిటో తెలియనంత అమాయకంగా లేరు. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు అన్నీ తెలుగుదేశం ఖాతాలోనే పడకా తప్పదు. దాని ఫలితం ఎంతో కొంత భరించకా తప్పకపోవచ్చు.

Show comments