అప్పుడు చిరంజీవి, పవన్.. ఇప్పుడు మహేష్

తన యాటిట్యూడ్ తో హీరోల అభిమానులతో సున్నం పెట్టించుకోవడం పూరి జగన్నాధ్ కు కొత్తేంకాదు. ప్రస్తుతం మహేష్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఈ హీరోకు, ఇలాంటి అనుభవం గతంలో కూడా ఉంది. అది కూడా చిరంజీవి ఫ్యాన్స్ తో కావడం విశేషం. చిరంజీవితో ఆటోజానీ అనే సినిమా ప్లాన్ చేశాడు పూరి. ఫస్టాఫ్ నెరేషన్ అయిపోయిందని సినిమా బాగా వచ్చిందని తనకుతాను ప్రకటించుకున్నాడు. కట్ చేస్తే, ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. సెకెండాఫ్ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్టును చిరంజీవి వద్దనుకున్నాడు. అయితే అదే టైమ్ లో పూరి చేసిన వ్యాఖ్యలు చిరు అభిమానులకు కోపం తెప్పించాయి.

అప్పట్లో ఆ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. పూరి కాస్త తగ్గడంతో పాటు మెగా కాంపౌండ్ కూడా కాస్త కాంప్రమైజ్ అవ్వడంతో ఆ వివాదం కనుమరుగైంది. మళ్లీ ఇన్నేళ్లకు మరో హీరో అభిమానులకు టార్గెట్ అయ్యాడు పూరి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ అభిమానులతో పెట్టుకున్నాడు. తను హిట్ కొడితేనే మహేష్ ఛాన్స్ ఇస్తాడని, లేదంటే పట్టించుకోడంటూ పూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. అక్కడితో ఆగకుండా.. తనకూ ఓ క్యారెక్టర్ ఉందని, మహేష్ వచ్చి అడిగిన వెంటనే సినిమా చేయాలా అనేరీతిలో పూరి స్పందించడంపై మహేష్ అభిమానులు భగ్గుమంటున్నారు.

గతంలో పవన్ కల్యాణ్ విషయంలో కూడా ఇలానే వివాదాస్పదంగా వ్యవహరించాడు పూరి. పవన్ కు కథ చెప్పనక్కర్లేదని, చేతిలో 2 గన్స్ పెడితే చాలని, వెంటనే సినిమా ఒప్పుకుంటాడని ఓ ఫంక్షన్ లో పూరి కామెంట్ చేశాడు. పూరి సరదాగానే కామెంట్ చేసినప్పటికీ పవన్ అభిమానులు మాత్రం దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా టైమ్ లో పూరిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

ఇలా వరుసగా హీరోల ఫ్యాన్స్ తో చీవాట్లు తింటున్నాడు పూరి. నిజానికి ఇక్కడ పూరి చెప్పిన దాంట్లో తప్పేంలేదు. అతడు నిజమే చెప్పాడు. కానీ కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి. వాటిని బయటపెట్టకపోవడమే మంచిది. చిక్కంతా అక్కడే వచ్చింది.

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..