వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. తెలుగుదేశం పార్టీ పగ్గాల్ని ఆయన ఎలా చేపట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రాజకీయ జీవితమంతా 'వెన్నుపోటు'మయమేనని రాజకీయ ప్రత్యర్థులే కాదు, రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతుంటారు. ఈసారి చంద్రబాబు 'వెన్నుపోటు' పొడిచింది, కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ మాత్రమే కాదండోయ్, మొత్తంగా ప్రజా కూటమికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచేశారు.
ముందస్తుగా టీఆర్ఎస్తో ఒప్పందం కుదుర్చుకున్న చంద్రబాబు, ఆ తర్వాత కాంగ్రెస్తో కలిసి కూటమి కట్టి.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమిని ముంచేశారన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బలంగా విన్పిస్తోన్న అభిప్రాయం. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత నడుమ భవ్య ఆనందప్రసాద్కి టిక్కెట్ ఇవ్వడం.
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డిని కాదని, టీడీపీ అభ్యర్థిని సనత్ నగర్లో నిలబెట్టడం, హరికృష్ణ కుమార్తె సుహాసిని కోసం.. కూకట్పల్లిలో పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ నేతల్ని మట్టి కరిపించెయ్యడం.. ఇలా చాలా అంశాల్ని ఉదాహరణలుగా చూపిస్తూ, చంద్రబాబు 'వెన్నుపోటు' గురించి అంతా చర్చించుకుంటుండడం గమనార్హం.
కొడంగల్లో రేవంత్రెడ్డి ఓటమి, సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు విజయావకాశాలు.. ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్లోనూ చంద్రబాబు 'వెన్నుపోటు' పొడిచారన్న అనుమానాలకు కారణమవుతున్నాయి. ప్రజాకూటమిలో పార్టీల మధ్య ఓటు బదలాయింపు జరగకపోవడం, ముఖ్యంగా టీడీపీ ఓట్లు టీఆర్ఎస్ వైపుకు వెళ్ళడంతో కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
మొదటి నుంచీ చంద్రబాబుని వ్యతిరేకిస్తోన్న కొందరు కాంగ్రెస్ నేతలు, ఈ ఓటమికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తుండడం గమనార్హం. అమరావతికి పిలిపించుకుని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతల్ని బుజ్జగించడం.
ఆ అంశాన్ని హైలైట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో ప్రజా కూటమిపై కేసీఆర్ నిప్పులు చెరగడం.. ఇదంతా, కూటమిని ముంచేందుకు చంద్రబాబు వేసిన ప్లాన్.. అన్న భావన తాజా ఫలితాలు చూశాక ఎవరికైనా కలగడం సహజమే.