ఎన్నెన్ని మాటలు మాట్లాడారు! నోటికి హద్దూ అదుపూ లేనట్టుగా చెలరేగి పోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి తెలుగుదేశం పార్టీలో చేరడమేకాదు.. అంతకు మించి వారి మాటలు ప్రజలను బాగా అసహనానికి గురిచేశాయి. అమర్నాథ్ రెడ్డి అయితేనేం, ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియ అయితేనేం.. వీళ్లంతా నిస్సిగ్గు రాజకీయం చేశారు. ఒకవైపు తాము రాజకీయ వ్యభిచారం చేస్తూ మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేలారు.
తాము చేసిందే ఒక దారుణమైన రాజకీయ వ్యభిచారం అయినప్పటికీ వీరు జగన్ మోహన్ రెడ్డి మీద నోరు పారేసుకున్న తీరు వారికే చేటు చేసింది. పార్టీ మారారు.. పోరాడే శక్తి లేదనుకున్నారు.. సరే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. మంత్రి పదవులు తీసుకున్నారు. అక్కడికి అయినా కాస్తంత నోరు కంట్రోల్లో ఉంచుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేం. తాము ఎవరి వల్ల గెలిచామో అనే ఇంగితం కూడా లేకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డినే నిందించేంత వాళ్లు అయ్యారు. అధికారం ఉందనుకున్నారు.
అయితే అసలు అధికారం ప్రజల చేతిలో ఉంటుందనే ప్రాథమిక విషయాన్ని మరిచిపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఫిరాయించిన ప్రతి నేతా చిత్తు అయ్యాడు. ఆదినారాయణ రెడ్డి, అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డిలు మరింత దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు. రెండేళ్ల మంత్రిపదవి కోసం వాళ్లు తమ రాజకీయ భవితవ్యాన్నే దారుణంగా దెబ్బతీసుకున్నారు. అనవిగాని అహంకారాన్ని కనబరిచి వీరు ప్రజల చేత ఛీ కొట్టించుకున్నారు. వీరి మీద వీరి ప్రత్యర్థులకు వచ్చిన మెజారిటీలు ప్రజలు వీరి మీద ఎంత ఏహ్యభావాన్ని పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఫిరాయించి కూడా ఎదురుదాడి చేస్తూ, ఇష్టానుసారం మాట్లాడుతూ.. ఏమాత్రం నైతికత, విలువలు లేకుండా వ్యవహరించిన ఇలాంటి వారికి రాజకీయంగా ఇలాంటి గతి పట్టాల్సిందే అని సామాన్య ప్రజలు కూడా అనుకున్నారు. అందుకే వీరంతా మూకుమ్మడిగా చిత్తు అయ్యారు. వీళ్లకు ఎదురైనా రాజకీయ పరాభవం నీఛ రాజకీయాలు చేసే వాళ్లెవ్వరికైనా ఒక పాఠంగా మిగిలిపోవాలి.