పవన్ వ్యూహాత్మక మౌనం

డిసెంబర్ నెలాఖరులో విదేశాలకు వెళ్లి జ‌నవరి మొదటివారం లో తిరిగి వచ్చారు జ‌నసేన అధిపతి పవన్ కళ్యాణ్. ఎయిర్ పోర్టులో కనిపించారు కనుక వచ్చారు అని తెలిసింది. లేదంటే అదీ తెలియదు. వచ్చింది లగాయతు మౌనమే భాషగా మారింది. 

ఇల్లు దాటి బయటకు రావడం గగనమైంది. రాగానే పార్టీ కార్యక్రమాల కోసం ఆంధ్ర వెళ్లాల్సి వుంది. అది క్యాన్సిల్ అయింది. మళ్లీ నాటికి నేడు ప్లాన్ లేదు. ఒకే ఒకసారి రిపబ్లిక్ డే సందర్భంగా ఫొటోల్లో దర్శనమిచ్చారు. అంతే

కొత్త జిల్లాల ఏర్పాటు కానీ, ఉద్యోగుల ఉద్యమం కానీ, విజ‌యవాడలో బాలికపై అఘాయిత్యంపై కానీ ఇలా దేని మీదా ఆయన పెదవి విప్పలేదు. ప్రెస్ నోట్ వదలలేదు. ఆఖరికి దేశానికి ఏటా కీలకమైన సాధారణ బడ్జెట్ వచ్చింది. దేశంలోని ప్రతి నాయకుడు మాట్లాడారు. ఆఖరికి చంద్రబాబు కూడా తొలిసారి కేంద్రం పెట్టిన బడ్జెట్ బాలేదు అన్నారు.

కానీ పవన్ నోటి వెంట మాటలేదు. ఆయన నుంచి ఓ ప్రెస్ నోట్ లేదు. అసలు ఏం జ‌రుగుతోందో? ఏమయిందో? ఎవరికీ తెలియదు. అసలు ఎందుకు బయటకు రావడం లేదో తెలియదు. 

కోవిడ్ భయమా అంటే ఒమిక్రాన్ వైరస్ కు ఎవ్వరూ భయపడడం లేదు. పవన్ లాంటి పవర్ స్టార్ కు భయమెందుకో? షూటింగ్ లు చేయక, ఏం చేస్తున్నది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.

భీమ్లానాయక్ విడుదలకు ముందు అనవసరపు వివాదాలకు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే పవన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని తెలుస్తోంది. 

Show comments