పవన్ ను కలిసిన సురేందర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్న డైరక్టర్ల జాబితాలో మరో పేరు చేరింది. సైరా సినిమాతో భారీ సినిమాల డైరక్టర్ గా మారిన సురేందర్ రెడ్డి లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హరీష్ శంకర్-పవన్ ను కలిపి ప్రాజెక్టు చేయాలని ప్రయత్నిస్తున్న మైత్రీ మూవీస్ సంస్థనే, సురేందర్ రెడ్డిని కూడా పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తప్పకుండా చేద్దాం అని పవన్ చెప్పి,పంపినట్లు బోగట్టా.

ఇదిలా వుంటే నిర్మాత దిల్ రాజు కూడా సురేందర్ రెడ్డిని బాహుబలి ప్రభాస్ దగ్గరకు తీసుకెళ్లారు. మే తరువాత అయితే తను అందుబాటులోకి వస్తానని ప్రభాస్ చెప్పినట్లు తెలుస్తోంది. 

ప్రభాస్ మే అన్నారు. పవన్ ఎప్పుడన్నది తెలియదు. ఎందుకంటే నెల రోజల కిందటి మాటల ప్రకారం పవన్ జనవరి నుంచి పింక్ కు, మార్చి నుంచి క్రిష్ సినిమాకు వస్తానని మాట ఇచ్చారు.

కానీ గత వారం పది రోజులుగా రాజకీయంగా  పవన్ బాగా యాక్టివ్ అవుతున్నారు. అందువల్ల ఆయన ఎప్పుడు ఆ రెండు సినిమాలు ఫినిష్ చేస్తారో? ఆ తరువాత హరీష్ శంకర్ అంటారో, సురేందర్ అంటారో తెలియదు.

అందుకే ఈ పెద్ద సినిమాలు చేతిలోకి వచ్చేలోగా, వరుణ్ తేజ్ తో ఓ మీడియం సినిమా చేస్తే ఎలా వుంటుందనే ఆలోచనలో కూడా సురేందర్ రెడ్డి వున్నారని తెలుస్తోంది.

Show comments