ఢిల్లీలో జనసేనాని :: చిక్కడు దొరకడు!

మోడీ నాకు చాలా చాలా క్లోజ్ అని పదేపదే అంటుంటాడు.. జగన్మోహన్ రెడ్డి పాలన చెత్తగా ఉంది.. ఢిల్లీలో పెద్దోళ్లని కలిసి దీని సంగతి తేలుస్తా అనేంత రేంజిలో పదేపదే హూంకరిస్తుంటాడు.

పవన్ ఢిల్లీ వెళితే గనుక.. ఏపీ రాష్ట్ర రాజీకాయలకు సంబంధించి.. ఏదేదో కీలక పరిణామాలు జరిగిపోతాయని.. ప్రజలందరిలో ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోయి ఉన్న వేళ.. జనసేనాని ఢిల్లీ యాత్ర అంటే.. సహజంగా ప్రజలందరిలో ఆసక్తి నెలకొంటుంది.

పవన్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు...? ఎవరిని కలుస్తున్నాడు? అనే సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి రిపోర్టర్లందరూ నానా హైరానా పడిపోయారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఢిల్లీ వెళ్లారే తప్ప.. మీడియా ప్రతినిధులు ఎవరికీ చిక్కడు దొరకడు అన్నట్లుగా తన పర్యటన ముగించుకువచ్చారు.

విజయవాడ పర్యటనలో ఉన్న  పవన్ కల్యాణ్.. శుక్రవారం హఠాత్తుగా ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. అప్పటికే ఆయన జగన్ మీద నిప్పులు చెరుగుతున్న తీరును బట్టి.. ఢిల్లీలో ఏ అమిత్‌షానో కలిసి.. జగన్ చాపకిందికి నీళ్లు తెస్తారేమో అని అంతా అనుకున్నారు. తీరా పవన్ కల్యాణ్ టూర్ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ముగిసిపోయింది.

ఆయన తన కదలికల గురించి ఎవరికీ తెలియనివ్వకుండా రహస్యగా హస్తినంలో సంచరించారు గానీ.. మీడియాకు మాత్రం ఆరాటం తప్పలేదు.

పవన్ విజయవాడలో బయల్దేరినప్పటినుంచి... ఆయన ఎందుకు ఢిల్లీ వస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అంటూ ఢిల్లీలోని నేషనల్ మీడియాతో సహా అందరూ.. పార్టీ ప్రతినిధుల్ని ఆరాతీయడం ప్రారంభించారు గానీ.. వారికేమీ తెలియలేదు.

శనివారం సాయంత్రం వరకు పవన్ ఢిల్లీలోనే ఉన్నారు. కానీ ఆయన ఏం చేశారో ఎక్కడ తిరిగారో ఎవరిని కలిశారో.. ఎవ్వరికీ తెలియదు. ఢిల్లీ మీడియా ప్రతినిధులు.. రకరకాల మార్గాల్లో ఆయన కార్యక్రమాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసి.. విఫలమై.. ఆయన టూరు గురించి పట్టించుకోవడమే మానేశారు.

అయినా.. తన ఢిల్లీ యాత్ర గురించి మీడియాలో ఇంత హైప్ క్రియేట్ అయినప్పుడు..  అంతో ఇంతో సమాచారం లీక్ చేసి.. మైలేజీ తెచ్చుకోకుండా.. పవన్ ఢిల్లీ మీడియాను దూరం చేసుకున్నాడేమిటా.. అని పలువురు విస్తుపోతున్నారు.

Show comments