అరవింద సమేత నుంచి ఐదో పాట వస్తోంది

కేవలం 4 పాటలతోనే అరవింద సమేత ఆడియో రిలీజైంది. ఐదో పాట పెట్టలేదని స్వయంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ వెల్లడించాడు. సినిమాలో కూడా ఆ ఐదో పాట ఉండదని గతంలో స్పష్టంచేశాడు. అయితే ఇప్పుడు అరవింద సమేత నుంచి ఐదో పాట ఒకటి వస్తోంది. ఇది సినిమాలోంచి తీసేశారని తమన్ చెప్పిన ఐదో పాట కాదు. ఆల్రెడీ సినిమాలో ఉన్న ఓ చిన్న సాంగ్ బిట్.

సినిమా చివర్లో రెడ్డమ్మ తల్లి అనే సాంగ్ బిట్ వస్తుంది. ఆ పాటను పెంచల్ దాస్ రాశారు. దగ్గరుండి తనే వేరే వాళ్లతో పాడించారు. అంతేకాదు, ఆ పాటను తన గొంతుతో కూడా పాడారు. అలా పెంచల్ దాస్ పాడిన వెర్షన్ ను ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. త్రివిక్రమ్ ఈ విషయాన్ని ప్రకటించాడు.

"పెంచల్ దాస్ ఒక పాట రాయడానికి వచ్చారు. ఆ తర్వాత సినిమాలోని మాటలన్నీ ఆయనతో రాయించాను. నా డైలాగ్స్ అన్నింటిలో ఆయనో చేయి వేశారు. సినిమాలో రెడ్డమ్మ తల్లి అనే పాట సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లింది.

పెంచల్ దాస్ అన్నగారు ఆ పాట కోసం చాలా రీసెర్చ్ చేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, మా కథకు తగ్గట్టు చిన్నచిన్న మార్పులు చేసి పెంచల్ దాస్ ఆ పాటను దగ్గరుండి పాడించారు. అంతేకాదు, ఆ పాటను పెంచల్ దాస్ కూడా పాడారు. ఆయన పాడిన వెర్షన్ ను సోమవారం (ఈరోజు) విడుదల చేస్తున్నాం."

ప్రపంచవ్యాప్తంగా సినిమాకు 100 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిన సందర్భంగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా పెంచల్ దాస్ పాటను రిలీజ్ చేయబోతున్నట్టు త్రివిక్రమ్ ప్రకటించాడు.

అయితే సినిమాలోంచి తొలిగించిన కొన్ని సన్నివేశాల్ని తిరిగి జోడిస్తారా లేదా అంశంపై మాత్రం త్రివిక్రమ్ క్లారిటీ ఇవ్వలేదు. బహుశా దసరా టైమ్ లో అరవింద సమేత సినిమాకు అదనంగా కొన్ని సన్నివేశాలు జోడించే ఛాన్స్ ఉంది.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments