తెలంగాణలో సెక్షన్ 8?...ఈ శీర్షికతో 2015, మే లేదా జూన్ నెలల్లో ఆంధ్రజ్యోతిలో ఓ కథనం వచ్చింది. తెలంగాణ సర్కార్ కక్షపూరిత చర్యలతో హైదరాబాద్లో శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని, దీంతో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8ను అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్లో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని, ఇందుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నుంచి నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం....ఇలా అప్పట్లో ఆంధ్రజ్యోతి కథనం రాసి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో చావు దెబ్బ తిన్న ఆర్కే...ఆ తర్వాత కొంత కాలం నోర్మూసుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో ఓటుకు నోటు, హైదరాబాద్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సెక్షన్ 8 తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి కథనాలే ఏపీలో ఆంధ్రజ్యోతి ప్రస్తుతం వండుతోంది. మూడు రోజుల క్రితం ఏపీలో కరోనా లెక్క తప్పుతోందంటూ ఓ కథనం రాశారు. ఈ కథనంలో "వైరస్ అనుమానితులకు చేస్తున్న వైద్య పరీక్షలపైనా పూర్తి నిజాలు చెప్పకుండా దాస్తోందా? మృతుల లెక్కలను సైతం సాధారణ మరణాల ఖాతాలో వేస్తోందా? కేంద్రం ఈ దిశగానే అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కేంద్ర నిఘా వర్గాలను మోడీ సర్కార్ ఏపీలో దించుతోంది"..అని ఓ కథనం రాశారు.
తాజాగా ఏపీలో ఏం జరుగుతోంది? అంటూ బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరా తీసినట్టు ఓ కథనం. అందులో "ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకూ కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ ...రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ...పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం ప్రత్యేక బృందాన్ని పంపే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మద్యప్రదేశ్ల నుంచి ఫిర్యాదులు రావడంతో టాస్క్ఫోర్స్ను నియమించిందని నడ్డా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక టాస్క్ఫోర్స్ పంపాల్సిన అవసరం ఉందని నడ్డా ఏపీ బీజేపీ నేతలతో అభిప్రాయపడినట్టు తెలిసింది "
రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలో కోత విధించడంతో ఏపీ భారీగా నష్టపోయింది. అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రావాల్సిన నిధుల్లో కూడా కోత విధించడంతో ఏపీ భారీగా నష్టపోయింది. లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలలాడుతుంటే పుండు మీద కారం చల్లినట్టు...ఆర్థికంగా ఆదుకోడానికి బదులు రావాల్సిన నిధుల్లో కూడా కోత విధించిన మోడీ సర్కార్పై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.
ఏపీకి మోడీ సర్కార్ చేస్తున్న ద్రోహం సరిపోదని...కేంద్ర నిఘా వర్గాలు, టాస్క్ఫోర్స్లు దింపుతోందంటూ ఆర్కే రాయడం విచిత్రంగా ఉంది. బహుశా ఇవేవీ సరిపోయేలా లేవు. కరోనా నిర్ధారణ పరీక్షలకు కొనుగోలు చేసిన కిట్లలో అవినీతి నిగ్గు తేల్చేందుకు సీబీఐ, ఈడీలను రంగంలోకి దింపుతుందని రేపో ఎల్లుండో ఓ కథనం రావచ్చు. అలాగే అవినీతి కేసులో జగన్ పాత్ర ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని కూడా కొన్ని రోజులకు ఆర్కే రాయొచ్చు.
ఈ నేపథ్యంలో పాలన అస్తవ్యస్తం కావడంతో ఏపీలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశాడనే కథనం కూడా రాయొచ్చు. గవర్నర్ సిఫార్సు మేరకు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించారనే కథనం రాసే అవకాశం లేకపోలేదు. కేంద్రం పాలనలో ఏపీ హ్యాపీ అనే కథనాలను మున్ముందు మనం చదువుకోవాల్సి రావచ్చు.
రాష్ట్రపతి పాలనలో పాలన వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను చంద్రబాబుకు అప్పగించవచ్చు. అంటే పరోక్షంగా మళ్లీ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి రాష్ట్రాన్ని పాలించవచ్చు...ఏమో , ఆర్కే ఏమైనా రాయొచ్చు. ఆయన ఏమైనా చేయవచ్చు. కరోనా వస్తుందని, ఇలా జరుగుతుందని ఎవరు ఊహించారు? విపత్తులన్నీ ఇలాగే వస్తుంటాయి, పోతుంటాయి. రాజకీయ విపత్తు కూడా కరోనా లాగే రావచ్చు, పోవచ్చు.
ఏపీకి రాబోయే రాజకీయ విపత్తుల గురించి తెలుసుకోవాలంటే ఆంధ్రజ్యోతిలో ఆర్కే రాతలు చదవాల్సిందే. ఆర్కే రాయడం వల్లే కదా నాడు తెలంగాణలో సెక్షన్ 8 అమలు చేసిన విషయాన్ని మరిచిపోతే ఎట్లా? ఇప్పుడు ఏపీ విషయంలో కూడా ఆర్కే చెప్పినట్టే మూడు రోజుల క్రితం కేంద్ర నిఘా వర్గాలొచ్చాయి. తాజాగా టాస్క్ఫోర్స్ వస్తోంది. ఇంకా ఆర్కే ఎవరెవరిని దింపుతారో చూడాలి మరి!