తన చెల్లి షర్మిలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా అసహ్యించుకుంటున్నారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి జగన్ టార్గెట్గా ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచారు. వైసీపీ తరపున వైఎస్ అవినాష్రెడ్డిని మరోసారి జగన్ నిలబెట్టారు.
ఈ నేపథ్యంలో వివేకా హత్య కేంద్రంగా షర్మిల, సునీత పదేపదే అవినాష్రెడ్డిని హంతకుడని విమర్శిస్తున్నారు. చిన్నాన్నను చంపిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని షర్మిల నిలదీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జగన్ భార్య భారతిని కూడా షర్మిల టార్గెట్ చేస్తూ, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ను కంట్రోల్ చేసే రిమోట్ భారతి చేతిలో వుందని షర్మిల వ్యక్తిగతంగా మాట్లాడ్డంపై వైసీపీ రగిలిపోతోంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుటుంబంలో విభేదాలు, అలాగే వివేకా హత్యకు సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు జగన్ చాలా కూల్గా సమాధానం ఇచ్చారు. ఒక్కటంటే ఒక్క సందర్భంలో కూడా షర్మిల పేరు పలకడానికి కూడా జగన్ ఇష్టపడలేదు. ఆమె, ఈమె అంటూ షర్మిల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఆమె హద్దులు దాటారని, ఇక చేయగలిగిందేమీ లేదని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు.
ఇంటర్వ్యూలో షర్మిల పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడని జగన్ను చూస్తే... చెల్లి చేష్టలపై రగిలిపోతున్నారనే భావన కలుగుతోంది. తన పరిధి దాటి, రాజకీయంగా నష్టం కలిగించేలా షర్మిల వ్యవహరిస్తుండడంపై జగన్ అసహనంగా ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో షర్మిల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, పరోక్షంగా ప్రస్తావించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.