ఈ ఏడాది ఐపీఎల్ లో పరుగుల విషయంలో వరస రికార్డులను నెలకొల్పుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ను ప్రేక్షకులకు చూపించింది. లక్నో బేస్డ్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అత్యంత వేగవంతంగా పరుగుల చేధన చేసి పది వికెట్ల విజయాన్ని సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే సన్ జట్టు చేధించింది. తద్వారా అత్యంత వేగవంతమైన చేధన రికార్డును సొంతం చేసుకుంది.
గతంలో ఐపీఎల్ లో రెండో ఇన్నింగ్స్ ను కేవలం ఐదారు ఓవర్లలో పూర్తి చేసిన జట్లున్నాయి. అయితే వాటి ముందు నిలిచిన లక్ష్యం కూడా తక్కువే! దాంతో.. ఏడెనిమిది ఓవర్లలోపే కొన్ని మ్యాచ్ లలో టార్గెట్ ను చేధించి విజయం సాధించిన జట్లున్నాయి. కానీ మందకొడిగా కనిపించిన పిచ్ పై 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే చేధించడం మాత్రం అద్భుతం అనే చెప్పాలి!
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు బ్యాటర్లు చాలా ఇబ్బంది పడుతూ ఆడారు. బంతి బౌన్స్ లేదంటూ కామెంటరేటర్లు చెప్పుకొచ్చారు. అయితే సన్ జట్టు ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మలు ఆ విశ్లేషణలకు పూర్తి భిన్నంగా ఆడారు.
అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు సాధించగా, హెడ్ 30 బంతుల్లో ఏకంగా 89 పరుగులు సాధించాడు. గత రెండు మూడు మ్యాచ్ లలో వీరిద్దరూ కాస్త మొదటి మ్యాచ్ లలో దూకుడును చూపలేదు! అందుకు భిన్నంగా ఈ మ్యాచ్ లో మళ్లీ మొదటి మ్యాచ్ లను గుర్తు చేశారు! ఏకంగా ఓవర్ కు 17కు పైగా రన్ రేటుతో వీరి విధ్వంసం కొనసాగింది.
ఈ మ్యాచ్ లో విజయం ఈ జట్టుకు చాలా కీలకం కూడా! ఇది ఈ సీజన్ లో ఈ జట్టుకు ఏడో విజయం. తద్వారా పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్ లో తమ స్థానాన్ని ఈ జట్టు పదిలం చేసుకుంది.