75 ఏళ్ల త‌ర్వాత రాజ‌కీయాలు చేస్తే ఆలోచ‌న‌లు...!

కాదేదీ రాజ‌కీయానికి అన‌ర్హం అనేది చంద్ర‌బాబు సిద్ధాంతం. నిజానిజాల‌తో సంబంధం లేకుండా ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో చంద్ర‌బాబు దిట్ట‌. అయితే ఆయ‌న నైజాన్ని తెలుగు స‌మాజం ప‌సిగ‌ట్టింది. బాబు మాట‌ల వెనుక ఆంత‌ర్యాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం గ్ర‌హించ‌డం వ‌ల్లే, ఆయ‌న పప్పులు ఉడ‌క‌డం లేదు. బాబు ఒక‌టంటే, ప్ర‌త్య‌ర్థులు ప‌ది మాట‌ల‌తో చీల్చి చెండాడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబునాయుడిపై మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. నంద్యాల‌లో ఆయ‌న శ‌నివారం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన అప్పులు ఆయ‌న క‌డ‌తారా? అని బుగ్గ‌న నిల‌దీశారు. 75 ఏళ్లు దాటిన త‌ర్వాత రాజ‌కీయాలు చేస్తే ఇలాంటి ఆలోచ‌న‌లే వ‌స్తాయ‌ని మంత్రి దెప్పి పొడిచారు.

ప్ర‌తి దానికీ ట్యాక్సులు క‌ట్టిన తాను ఆర్థిక నేర‌స్తుడిని అయితే, మ‌రి మిమ్మ‌ల్ని ఏమ‌నాల‌ని డోన్ టీడీపీ అభ్య‌ర్థి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డిని బుగ్గ‌న ప్ర‌శ్నించారు. రైల్వే స‌హాయ మంత్రిగా వుంటూ, పేకాట ఆడ‌ట‌మేనా అందుబాటులో ఉండ‌డం అంటే అని ఆయ‌న ప్ర‌శ్నించారు. డోన్‌లో అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని విమ‌ర్శిస్తున్నార‌ని, ఒక్క‌రోజు త‌న‌తో పాటు తిరిగితే తానేం చేశానో చూపుతాన‌ని కోట్ల‌కు బుగ్గ‌న సూచించారు. పుష్క‌ర కాలం ఎంపీగా ఉండి, ఏం చేశావ‌ని కోట్ల‌ను బుగ్గ‌న ప్ర‌శ్నించారు. 

త‌న నామినేష‌న్‌ను రాజ‌కీయం చేయ‌డంపై బుగ్గ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆస్తుల స‌హా, దానికి సంబంధించిన అన్ని ప‌త్రాల‌ను రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

Readmore!

Show comments