టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబునాయుడు బాంబు పేల్చారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు మోదీ సర్కార్ గతంలో కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో దామాషా పద్ధతిలో పవన్ సామాజిక వర్గానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అగ్రవర్ణాల ప్రజానీకం రగిలిపోతోంది.
2019 ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కీలక ఉత్తర్వులు తీసుకొచ్చింది. అధికారం చివరి రోజుల్లో చంద్రబాబునాయుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కాపులకు చట్ట విరుద్ధంగా 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం బాబు తప్పిదాన్ని సవరించి, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకే 10 శాతం రిజర్వేషన్ ఫలాలు అందేలా చేశారు.
తాజాగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్కల్యాణ్ను సంతృప్తి పరచడానికి చంద్రబాబు మరోసారి అదే తప్పు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేనిఫెస్టోలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కాపులకు దామాషా పద్ధతిలో వాటా కల్పిస్తానని పేర్కొనడం వివాదానికి దారి తీసింది.
దీంతో మరోసారి 5 శాతం రిజర్వేషన్ కోత విధించే హక్కు చంద్రబాబునాయుడికి ఎవరిచ్చారనే ప్రశ్న ఉత్పన్నమైంది. అసలు అధికారంలోకి చంద్రబాబునాయుడు వస్తే కదా, అగ్రవర్ణాల రిజర్వేషన్లో కోత విధించడానికి అని మరికొందరు నిలదీస్తున్నారు.